అసమర్థ అశోక.. గజపతిరాజుపై విజయసాయిరెడ్డి విసుర్లు..
మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక గజపతిరాజు బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ రాజకీయ వేడి మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దానికి దారితీసింది. మన్సాస్ ట్రస్ట్లో ఆడిటింగ్ గురించి అశోక లేఖ రాయడంతో.. వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి స్పందించారు. చైర్మన్ చేసి.. ట్రస్టులో చక్రం తిప్పి లేఖ రాయడం ఏంటీ అని ప్రశ్నించారు. ఈ మేరకు వరసగా ట్వీట్లు చేశారు.
ఆడిటింగ్ జరిగిందో లేదో తెలియదా..?
మన్సాన్ ట్రస్టులో ఆడిటింగ్ జరిగిందో లేదో అశోక గజపతిరాజుకు తెలియదా అని అడిగారు. ఇప్పుడు లేఖ రాయడం ఏంటీ అని నిలదీశారు. చైర్మన్గా ఉండి.. దోపిడీ జరిగిందో తెలియని స్థితిలో గజపతిరాజు ఉన్నారా అని అడిగారు. ఈ మేరకు ట్వీట్ చేసి ప్రశ్నించారు. మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా సంచయితను నియమించడంతో వివాదం నెలకొంది. దీనిపై కోర్టుకు వెళ్లగా.. ఆమె నియామకం చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అశోక గజపతిరాజు తిరిగి చైర్మన్గా బాధ్యతలను స్వీకరించారు. దీనిపై విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఇదీ నేపథ్యం..
విజయనగరం పూసపాటి గజపతి రాజుల వంశంలో చివరి ప్రిన్స్ పూసపాటి విజయరాం గజపతి రాజు (పీవీజీ రాజు) తన తండ్రి జ్ఞాపకార్తం మహారాజా అలక నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (మాన్సాన్) 1958 నవంబర్ 12వ తేదీన ఏర్పాటు చేశారు. విద్య, సంస్కృతి, సంగీతానికి పెద్దపీట వేసిన ట్రస్ట్.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 14 వేల 800 ఎకరాల భూమి నియంత్రణలో ఉంది. దీనికి ప్రస్తుత విలువ రూ.50 వేల కోట్లు ఉంటుంది. దీంతోపాటు 108 ఆలయాలు, వాటి భూములు కూడా ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ఎల్ కేజీ నుంచి పీజీ వరకు 12 విద్యా సంస్థలు ఉండగా.. 15 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1800 మంది ఉపాధి పొందుతున్నారు. ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి గజపతి వంశస్తులే ట్రస్ట్, సింహాచల ఆలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
పీవీజీ.. ఆనంద.. అశోక టు సంచయిత...
1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నారు. ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజు బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పీవీజీ రాజు చనిపోయిన తర్వాత ఆనంద గజపతి రాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆనంద మృతిచెందాక అశోక గజపతిరాజు చైర్మన్ అయ్యారు. కానీ 2020 మార్చి 4వ తేదీన ఆనంద గజపతిరాజు రెండో కుతూరు సంచయితను మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ చేశారు. అంతకుముందే సింహాచల అప్పన్న ఆలయ చైర్మన్ చేశారు. జీవో నంబర్ 75తో ఏపీ సర్కార్ జీవో జారీచేసింది. దీంతో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
ఆనంద రెండో భార్య కూతురు.. సంచయిత...
సంచయిత.. ఆనంద గజపతిరాజు రెండో భార్య ఉమా కూతురు.. కాగా ఆమె విజయనగరం, విశాఖలో కాక ఢిల్లీలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. రాజకీయంగా బీజేపీ ఆమెకు ప్రాధాన్యం ఇస్తోంది. బీజేపీలో చేరిన సంచయితకు.. చిన్నాన్న అశోకతో సన్నిహిత సంబంధాలు లేవు. అలా తన స్వస్థలంలో మంచి పనులు చేస్తూ దగ్గరయ్యారు. ఈ సమయంలో ఆలయ చైర్మన్, మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. దీనిని సవాల్ చేస్తూ అశోక గజపతిరాజు కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసులో ఆయన నెగ్గి.. తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.