తీరని వేదన: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై విజయశాంతి ఏమన్నారంటే?
హైదరాబాద్: విశాఖ ఎల్జీ పాలీమర్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పందించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Vizag gas leak: సుమోటోగా హైకోర్టు, ఏపీ, కేంద్ర సర్కారుకు నోటీసులు
'కరోనావైరస్ ఒక వైపు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో విశాఖపట్నం, పరిసర గ్రామాల ప్రజలు విషవాయువు ప్రభావానికి లోనై తీవ్ర అనారోగ్యం పాలవడం, మరణాలు సంభవించడం వంటి పరిణామాలు తీరని వేదనను మిగిల్చాయి' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.
'బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గుండె ధైర్యంతో కరోనాపై పోరాడుతున్న విశాఖ పౌరులు, పరిసర గ్రామాలవారు ఈ విషవాయువు ప్రభావం నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను' అని విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
కాగా, గ్యాస్ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గోపాలపట్నం పోలీసులు ఆ సంస్థపై సెక్షన్ 337, 338, 304 కింద కేసులు నమోదు చేశారు. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సుమోటోగా తీసుకున్న కోర్టు..
విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఈ ఘటన ప్రజల ప్రాణాలతో కూడుకున్న నేపథ్యంలోనే సుమోటోగా తీసుకోవడం జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది.
జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాదకర పరిశ్రమ ఎలా ఉందని హైకోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అమికస్ క్యూరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.