నూతన్ నాయుడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ- కోర్టు అనుమతి - పెందుర్తి పీఎస్లో విచారణ..
తన ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన కేసుతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరును వాడుకుంటూ ఛీటింగ్ చేసిన కేసుల్లోనూ నూతన్ నాయుడికి చిక్కులు తప్పడం లేదు. నూతన్ నాయుడిపై పోలీసులు దాఖలు చేసిన ఎెఫ్ఐఆర్ ఆధారంగా విశాఖ కోర్టు ఇవాళ ఆయన్ను మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
Recommended Video
విశాఖ జిల్లాలో నూతన్ నాయుడు చేసిన పలు మోసాలతో పాటు తాజాగా ఆయన ఇంట్లో చోటు చేసుకున్న శిరోముండనం కేసు ఆయన మెడకు చుట్టుకుంది. ఆయా కేసుల్లో నూతన్ పాత్ర ఉన్నందున ఆయన్ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను విశాఖ కోర్టు అనుమతించింది.. దీంతో వచ్చే మూడు రోజుల పాటు పెందుర్తి పీఎస్లో నూతన్ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
నూతన్పై ఇప్పటికే శిరోముండనం కేసుతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో ప్రభుత్వాధికారులకు చేసిన ఫేక్ ఫోన్ కాల్స్ మోసాలు, బ్యాంకు డైరెక్టర్ పోస్టు ఇప్పిస్తానంటూ పశ్చిమగోదావరి జిల్లాలో రూ.20 కోట్ల వసూలు, ఆస్పత్రిలో ఉద్యోగం పేరుతో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.4 లక్షలు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే నూతన్పై నమోదైన కేసుల్లో ప్రాథమిక ఆధారాలు సంపాదించిన పోలీసులు.. తదుపరి దర్యాప్తు కోసం ఆయన్ను పోలీసు కస్టడీకి తరలించనున్నారు. శిరోముండనం ఘటనలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత నూతన్ చేసిన మరిన్ని మోసాలు వెలుగు చూస్తుండటంతో తదుపరి విచారణ ద్వారా కీలక ఆధారాల సేకరణకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీటిలోనూ నూతన్ మోసాలు నిర్ధారణ అయితే ఆయనపై అట్రాసిటీతో పాటు ఇతర కేసులు కూడా మోపి ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు.