విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం : సీఎం జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కార్మికుల అల్టిమేటం !!
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇకపై మరింత ఉధృత రూపం దాల్చనుంది. ఇప్పటికే ఉక్కు పరిరక్షణ సమితి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోకుంటే ఎక్కడిదాకైనా వెళ్తామని, తేల్చి చెప్పిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు.
Recommended Video
ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం .. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదన్న కేంద్రం !!
సీఎం జగన్ ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలని కార్మికుల డిమాండ్
ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలనా విభాగం గేటు ఎదుట నిరసన చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు సీఎం జగన్ ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఏపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. తమతో పాటు నిరసనలలో భాగస్వాములు అవుతూ కేంద్రం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా ప్రయత్నం చేయాలని వారు కోరుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యేలు ,ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని వార్నింగ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు అందరూ రోడ్డుమీద పడతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ప్రజా ప్రతినిధులంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ,ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరుబాట పట్టకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని చెబుతున్న నాయకులంతా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమం కోసం కార్యాచరణ ప్రణాళిక .. ముందు ముందు మరింత ఉధృతంగా
ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణా సమితి నేతలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. ఉక్కు కార్యాచరణ సమితి ఈ అంశంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలను కలవాలని వారు నిర్ణయించారు. ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, పార్లమెంటును స్తంభింప చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకునే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇదిలా ఉంటే కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎవరూ ఆపలేరని తేల్చి చెప్తుంది.