టీడీపీ మాజీ మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు- నర్సీపట్నంలో వ్యక్తి అరెస్ట్
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటు మరికొందరు నేతలను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు ఱరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన తాతారావుగా అతన్ని గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో తాతారావు బీటెక్ పూర్తి చేసి ప్రముఖ నేతలకు ఫోన్ బెదిరింపులు, మెసేజ్లు పంపుతున్నట్లు గుర్తించారు. దీని వెనుక కారణాలను ఆరా తీస్తున్నారు. తాతారావు ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రేవంత్రెడ్డిని కూడా బెదిరించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను బెదిరించిన కేసులో పోలీసులు గతంలో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్పై బయటికి వచ్చి ఇతర నేతలను బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
తాతారావు విచారణలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తాజాగా గత నెల రెండోవారంలో బెదిరించినట్లు అంగీకరించాడు. ఈ మేరకు మాజీ మంత్రికి బెదిరింపు మెసేజ్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయ్యన్నపాత్రుడిని చంపే ప్రయత్నం జరుగుతోందని తనకు సమాచారం ఉందని తాతారావు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా అతడి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా మరోసారి అరెస్టు చేసినట్లు విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు తెలిపారు.