Executive Capital: విశాఖలో వాహనదారులకు సరికొత్త నిబంధన: ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!
విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించబోతున్న విశాఖపట్నంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సచివాలయాన్ని తరలించడం, విశాఖను కేంద్రబిందువుగా చేసుకుని పరిపాలన ఆరంభమైన తరువాత ఏర్పడబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలను తీసుకుంటోంది. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత వాహనాల రద్ద మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ఇప్పటికే కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో సరికొత్త నిబంధనను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వెనక కూర్చున్న వారికీ హెల్మెట్ తప్పనిసరి..
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అనేది తెలిసిన విషయమే. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. వెనక కూర్చున్న వారు కూడా ఆ నిబంధనను పాటించి తీరాల్సి ఉంటుంది. వెనక కూర్చున్న వారి విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంటారు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇదీ తప్పనిసరే. హైదరాబాద్లో ఈ మధ్యే ఈ నిబంధననను తప్పనిసరి చేశారు. వెనక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాను విధిస్తున్నారు. అలాంటి నిబంధనను విశాఖపట్నంలో కూడా అమలు చేయనున్నారు ట్రాఫిక్ అధికారులు.
ప్రమాదాల్లో తీవ్ర గాయాలు..
2019లో చోటు చేసుకున్న ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వెనక కూర్చున్న వారు దుర్మరణం పాలు కావడమో లేక తలకు తగిలిన తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు కావడమో చోటు చేసుకున్నాయి. గత ఏడాది చివరి ఆరు నెలల్లో 11 ద్విచక్ర వాహన ప్రమాదాలు నమోదైతే.. అయిదు మంది వాహనదారులు మరణించారు. వెనక కూర్చున్న వారు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ అధికారులు వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ను ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు.
రాజధానిగా మారిన తరువాత.. వాహన రద్దీ ఓ కారణమే..
వచ్చే ఉగాది నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించాలని ఇదివరకే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. దీనికోసం భీమిలీ మార్గంలోని మధురవాడ వద్ద గల మిలీనియం టవర్స్ను ఎంపిక చేసింది. ఇప్పటికే వాహనదారులతో నిండిపోయిన విశాఖ.. రాజధానిగా మారిన తరువాత.. మరింత ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థిత ఏర్పడుతుందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా వాహన ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకే వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ను తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు.