మావోయిస్టు కీలక నేత కామేష్ అరెస్ట్: ఆయనపై రూ. 4 లక్షల రివార్డు
విశాఖపట్నం: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. గాలికొండ ఏరియా కమిటీ కీలక సభ్యుడు గమ్మెల కామేష్ అలియాస్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కామేష్పై 50కిపైగా కేసులున్నాయి. అంతేగాక, అతనిపై రూ. 4 లక్షల రివార్డు కూడా ఉంది.
మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో కామేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కామేష్ అరెస్ట్ విషయాన్ని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. దీంతో ప్రభుత్వ ప్రోత్సహాకాలు కూడా అందుతాయని తెలిపారు.
ఇది ఇలావుండగా, తెలంగాణ-ఛత్తీస్గఢ్, ఏవోబీలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు నెల రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు వారోత్సవాలు ముగియడంతో కూంబింగ్ ఆపరేషన్ను ముగించుకుని బలగాలు వెనుదిరిగినట్లు సమాచారం.
తెలంగాణకు చెందిన గ్రౌహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు పలు దఫాలుగా దండకారణ్యంలోకి వెళ్లాయి. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల అలజడితో సరిహద్దు గిరిజన ప్రజలు ఆందోళనలకు గురయ్యారు.
గుండాల మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు, చర్ల మండలంలోని పూసుుప్ప సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు, చెన్నాపురం అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేసి రహదారులను పేల్చివేయడం ఓవైపు, మరోవైపు మావోలు పెట్టిన మందుపాతరలను పోలీసులు వెలికి తీసి నిర్వీర్యం చేయడం లాంటి ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి.
పోలీసుల కూంబింగ్ కొంత మేర నిలిచిపోవడంతో ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మారుమూల గ్రామాలు ఇప్పుడు కొంత ప్రశాంతంగా మారాయి.