యారాడ బీచ్ విషాదం: ఓ నేవీ సెయిలర్ మృతి, మరొకరు గల్లంతు
విశాఖపట్నం: నగరంలోని యారాడ సముద్ర తీరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈతకు దిగిన ఇద్దరు నేవీ సెయిలర్లు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో మొత్తం 54 మంది నేవీ సిబ్బంది సరదాగా గడిపేందుకు బీచ్కు వెళ్లారు.
కాగా, వీరిలో మణిపూర్కు చెందిన జగత్ సింగ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శుభమ్ సింగ్తోపాటు సునీల్, వినీత్ కుమార్ సముద్రం ఒడ్డున వాలీబాల్ ఆడారు. ఆ తర్వాత ఈతకు దిగారు. కెరటాల ఉధృతికి జగత్ సింగ్, శుభమ్ కొట్టుకుపోవడం చూసి మిగితా ఇద్దరు ప్రాణభయంతో ఒడ్డుకు వచ్చేశారు.
జగత్ సింగ్(28), శుభమ్(23)లను రక్షించేందుకు మిగితావారు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. జగత్ సింగ్ను ఒడ్డుకు చేర్చిన అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో గల్లంతైన శుభమ్ కోసం హెలికాప్టర్ ద్వారా గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై విశాఖపట్నం న్యూపోర్టు పోలీసులకు నేవీ కమాండెంట్ విజయ్ కృష్ణన్ ఫిర్యాదు చేశారు.