వైసీపీ పోరు షురూ: నిర్మలమ్మతో భేటీ: యాక్షన్ ప్లాన్: ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఎందాకైనా
విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేపట్టింది. దీన్ని అమ్మకానికి పెట్టొద్దంటూ ఇదివరకే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎలా లాభాల్లోకి తీసుకుని రావచ్చనే విషయంపై మీద కొన్ని సూచనలు చేశారు. తాజాగా- కేంద్రంపై రాజకీయపరమైన ఒత్తిళ్లను తీసుకుని రావడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసింది.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి, లోక్సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రాజంపేట), మార్గాని భరత్ (రాజమండ్రి), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), మాగుంట శ్రీనివాసుల రెడ్డి (ఒంగోలు), డాక్టర్ బీవీ సత్యవతి (అనకాపల్లి).. కేద్రమంత్రిని కలిశారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. వైజాగ్ స్టీల్ ఫ్మాక్టరీ.. రాష్ట్రానికే ఆభరణం వంటిదని, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగమైందని చెప్పారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విజ్ఙప్తి చేశారు. ప్రైవేటీకరించడం వల్ల రాజకీయ ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ఇదివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వయంగా విశాఖ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని వారు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే ఉద్యమానికి వెంకయ్య నాయుడు సారథ్యాన్ని వహించారని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 17 వేల మందికి పైగా, పరోక్షంగా లక్ష మందికి పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. ప్రైవేటీకరించడం వల్ల వారి జీవితాలు ప్రభావితమౌతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవంక- అమలాపురం లోక్సభ సభ్యురాలు చింతా అనురాధ రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయెల్ను కలిశారు. ప్రతిష్ఠాత్మక కోటిపల్లి- నర్సాపూర్ రైల్వే లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ రైల్వే లైన్ త్వరితగతిన పూర్తి చేయడం వల్ల తీర ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు ఈ రైల్వే లైన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ.. అది పూర్తి కావట్లేదని చెప్పారు. నిర్ణీత సమయంలోగా దీన్ని పూర్తి చేయాలని కోరారు.