కేంద్ర మంత్రి సమాధానంతో ముదురుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం..ఆందోళనలు మరింత ఉధృతం
విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ముదురుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టారు .అఖిలపక్ష నాయకులు కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం అంగీకరించబోమని కార్మికులు తేల్చి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వెనుక పోస్కోతో ఒప్పందం
'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో మరోమారు విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించాలనే నిర్ణయం వెనుక పోస్కో సంస్థకు సంబంధించిన ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయాన్ని వెల్లడించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని, 2019 అక్టోబర్ లోనే పోస్కో సంస్థతో, విశాఖ స్టీల్ ప్లాంట్ ఒప్పందం కుదిరిందని, కొత్త ప్లాంట్ లో పోస్కో సంస్థ వాటా 50 శాతంగా ఉండబోతోందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో రేగిన దుమారం
పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే జాయింట్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసినట్లుగా కూడా ఆయన తెలిపారు. ఒప్పందం తర్వాత పోస్కో ప్రతినిధి బృందం మూడు సార్లు స్టీల్ ప్లాంట్ ను సందర్శించినట్లుగా కూడా వెల్లడించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలతో విశాఖ ఉక్కు ఉద్యమంలో దుమారం రేగింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉక్కు సంకల్పంతో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ జేఏసీ ఏర్పాటు..ర్యాలీలు , బహిరంగ సభలు , నిరాహార దీక్షలు ప్లాన్
విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్న కార్మిక విద్యార్థి ప్రజాసంఘాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ జేఏసీని ఏర్పాటు చేసుకున్నాయి. కార్మికులను, ప్రజలను భాగస్వాములను చేసి పోరాటం సాగించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది . ఈనెల 18వ తేదీన నగరంలో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరపాలని ప్లాన్ చేశారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే నిరాహార దీక్షలకు దిగాలని నిర్ణయించారు.
ముదురుతున్న ఉద్యమం .. జగన్ కు తెలుసన్న కేంద్ర మంత్రి సమాధానంతో ఆగ్రహం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన సమాధానంలో పోస్కో సంస్థ గురించి వెల్లడించారు. ఇక ఈ విషయం మూడేళ్లుగా జగన్ మోహన్ రెడ్డికి తెలుసన్న సమాధానంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాలని పోరు బాట పట్టారు.