టీడీపీ ఎమ్మెల్యే భూకబ్జా?: స్వాధీనం చేసుకున్న అధికారులు: రాజకీయ కక్షసాధింపు చర్యేనంటూ
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ఆక్రమించినట్లుగా భావిస్తోన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. తెలుగుదేశం ప్రభత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూఆక్రమణలకు పాల్పడ్డారని, వారికి చెక్ పెట్టేలా వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యతోనే జగన్ సర్కార్.. తమను ఇబ్బందులకు గురి చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Recommended Video
ఇదివరకు- లోక్సభ మాజీ సభ్యుడు, విశాఖపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి ఆక్రమించినట్లుగా భావించిన ప్రభుత్వ స్థలాన్ని కొద్దిరోజుల కిందటే గ్రేటర్ విశాఖ మన్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మరీ ఆయన నిర్మించిన భవనంలోని కొంత భాగాన్ని కూలదోశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. తాజాగా అదే తరహాలో విశాఖపట్నానికే చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తన ఆధీనంలోకి తీసుకున్న భూమిని జిల్లా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మెల్యే వెలగపూడి.. విశాఖ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విశాఖపట్నం శివార్లలోని రుషికొండ వద్ద వెలగపూడికి చెందిన కొంత భూమి ఉంది. దాని చుట్టూ కంచె వేసిన సమయంలో ఆయన ఆరు సెంట్ల వైశాల్యం గల పోరంబోకు భూమిని కలుపుకొన్నారంటూ ఇదివరకు ఆరోపణలు ఉన్నాయి. దానిపై అధికారులు విచారణకు ఆదేశించారు. అది నిజమేనని తేలింది. రుషికొండ పరిధిలో సర్వే నంబర్ 21లోని ప్రభుత్వ భూమిలో వెలగపూడి తాత్కాలిక కట్టడాలను నిర్మించినట్లు నిర్ధారించారు. వాటిని తొలగించాలంటూ ఇదివరకు ఆదేశాలను జారీ చేశారు.
దానికి ఆయన స్పందించకపోవడంతో అధికారులు స్వయంగా వాటిని కూలదోశారు. తాత్కాలికంగా నిర్మించిన షెడ్డు, ప్రహరీగోడను పడగొట్టారు. ప్రొక్లైనర్ తో నిర్మాణాలను తొలగి౦చడంతో పాటు వాటికి హద్దులను ఏర్పాటు చేశారు రెవిన్యూ శాఖ అధికారులు. అనంతరం సంబంధిత భూమిలో.. హెచ్చరికల బోర్డులు అమర్చారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ చర్యలను తప్పుపడుతున్నారు. అధికార పార్టీ తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. చట్టబద్ధమైన డాక్యుమెంట్లను చూపించినప్పటికీ.. పట్టించుకోవట్లేదని భగ్గుమంటున్నారు.