విశాఖలో భూముల ధరలకు రెక్కలు: అమరావతిలో రియల్ ఎస్టేట్ ఢమాల్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు అంటూ చేసిన ప్రకటన దుమారం రేపింది. రాజధాని అమరావతిపై నీలినీడలు కమ్ముకున్న వేళ రాజధాని అమరావతిలో భూముల ధరలు కుప్ప కూలిపోగా, వైజాగ్ లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. వైజాగ్ పై రియల్టర్ల కన్ను పడింది. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు లబోదిబోమంటున్నారు.
విశాఖలో భూముల ధరలకు రెక్కలు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకు తరలిపోవడం పక్కా అని భావిస్తున్న తరుణంలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి భీమిలి ప్రాంతంలోనే రాజధాని మహానగరం రాబోతోందంటూ ప్రకటించడం విశాఖలో భూముల ధరలకు రెక్కలు వచ్చేలా చేశాయి. జగన్ చేసిన ప్రకటనతోనే విశాఖలో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. విశాఖతోపాటు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు జరుగుతున్నాయి. అయితే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటవుతుందన్న ప్రకటనతో విశాఖ భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
విశాఖలో గజం భూమి ధర లక్షన్నర
విశాఖ నగరంలో భూమి ధర గజం లక్షన్నర వరకు పలుకుతుంది. సహజంగానే విశాఖ నగరంలో భూముల ధరలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక విశాఖకు అదనపు హంగులా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి చేరుతుందన్న వార్తల నేపధ్యంలో ఇక ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఏపీ రాజధాని నగరంగా విశాఖ మారనుండటంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, స్థలాలు కొనుగోలు చేయడానికి రియల్టర్లు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భూముల ట్రేడింగ్ లో 12.5శాతం వృద్ధిరేటు
దాంతో, భూముల ధరలు భవిష్యత్ లో కూడా మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భూముల ట్రేడింగ్ లో 12.5శాతం వృద్ధిరేటు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.మూడు రాజధానుల ప్రకటన తర్వాత విశాఖలోని జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, ఎంవీపీకాలనీ, సీతమ్మ ధారా, దసపల్లా హిల్స్, డాబా గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో గజం ధర అక్షరాలా లక్షన్నర రూపాయలు పలుకుతోంది.
విశాఖ శివారు ప్రాంతాల్లోనూ పెరిగిపోయిన ధరలు
అదే విశాఖ శివారు ప్రాంతాలైన కొమ్మాది, మధురవాడ, సింహాచలం, పెందుర్తి, రుషికొండ, భీమిలి తదితర ఏరియాల్లో గజం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది. ఇక, కాపులుప్పాడ, రుషికొండ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఆ ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం జరగుతుందని తెలుస్తుంది.నివేదికల ప్రకారం, రియల్టర్లు వివిధ వెంచర్లలో ప్లాట్ల ధరను కనీసం 30% పెంచారు. వ్యవసాయ భూమి ధర కూడా పెరిగింది. అదే సమయంలో భోగపురం విమానాశ్రయం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అంకపల్లి నుండి విమానాశ్రయానికి మెట్రో సేవలను ప్రారంభించాలనే ప్రతిపాదన ఉంది.
అమరావతిలో కుప్పకూలిన రియల్ వ్యాపారం.. భారీగా తగ్గిన ధరలు
మరోవైపు, ఏపీ రాజధాని నగరంగా ఇంతకాలం ఉన్న అమరావతిలో భూముల ధరలు సగానికి పడిపోయాయి. ఇప్పటికే చాలా మంది రియల్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టి తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఆర్ధిక నష్టాల్లో పడ్డారు. ఇప్పటికే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి కొనుగోలు చేసే వారు లేక రియల్టర్లు లబోదిబో అంటున్నారు. నిన్నటి దాకా ఎకరం దాదాపు మూడు కోట్ల రూపాయలపైనే పలికింది . ఇక ఇప్పుడు రెండుకోట్లకు పడిపోయింది. ఏది ఏమైనా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమరావతి భూముల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు తాజా ప్రకటనతో మరింత కుదేలవుతున్నాయి.