అడ్వెంచర్ ట్రిప్ లో అపశృతి: 25 అడుగుల ఎత్తు నుంచి దూకి..యుఎస్ లో విశాఖ యువకుడి దుర్మరణం
విశాఖపట్నం: ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన విశాఖపట్నానికి చెందిన యువకుడొకరు ప్రమాదవశాత్తూ అక్కడ దర్మరణం పాలైన ఉదంతం ఇది. క్రేటర్ లేక్ జాతీయ పార్క్ లో అడ్వెంచర్ ట్రిప్ కోసం వెళ్లిన ఆ యువకుడు.. దురదృష్టవశావత్తూ ప్రమాదానికి గురయ్యారు. మృత్యువాత పడ్డారు. ఆయన పేరు సుమేధ్. వయస్సు 27 సంవత్సరాలు. ఆయన తండ్రి విశాఖ ఉక్కు కర్మాగారంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు.
అసెంబ్లీ ఫర్నిచర్ ఎలా తీసుకెళ్తారు?: దెబ్బతిన్న పార్టీ ప్రతిష్ఠ: కోడెలపై వర్ల రామయ్య ఫైర్!
ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకున్న సుమేధ్.. రోబోటిక్స్ లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తున్నారు. సెలవురోజు కావడంతో తన స్నేహితులతో కలిసి ఆయన క్రేటర్ లేక్ జాతీయ పార్కులో అడ్వెంచర్ ట్రిప్ కోసం బయలుదేరి వెళ్లారు. నేల మీది నుంచి సుమారు 25 అడుగుల ఎత్తు ఉన్న జంపింగ్ రాక్ మీది నుంచి సరస్సులోకి దూకే ప్రయత్నంలో సుమేధ్ ప్రమాదానికి గురయ్యారు. అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. బండరాయి మీది నుంచి సరస్సులోకి దూకిన తరువాత ఇక బయటికి రాలేకపోయారు. సరస్సులో మునిగి మృతి చెందారు.
ఆయనతో వెళ్లిన స్నేహితులు ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. 24 గంటల తరువాత సుమేధ్ మృతదేహాన్ని వెలికి తీశారు. సుమేధ్ మృతదేహం క్లామత్ వాటర్ ఫాల్స్ వరకు కొట్టుకుని పోయిందని, జలపాతం వద్ద సుమారు 90 అడుగుల కిందన రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉందని పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ల సహకారంతో సుమేధ్ మృతదేహాన్ని సోమవారం ఉదయం బయటకు తీశారు.