చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ .. విశాఖ ప్రజలు నమ్మరన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ కు వెళ్లి సమీక్ష సమావేశం నిర్వహించారు చంద్రబాబు. విశాఖకు చంద్రబాబు వెళ్లిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
వైసీపీ శాసనసభ్యుడు గుడివాడ అమర్ నాథ్ చంద్రబాబు నాయుడు విశాఖపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ ఇప్పుడు వరకు విశాఖపట్నం నగరానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. ఆయన చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. అంతే కాదు టిడిపి హయాంలోనే విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. టిడిపి మంత్రులు, నేతలు కలిసి ప్రజల భూములను కొల్లగొట్టారని గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. విశాఖ ఆస్తులను ఎవరి పరం చేద్దామా అన్న ఆలోచనే తప్ప, నగరానికి ఆయన ఎలాంటి మేలు చేయలేదని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
విశాఖ నగరాన్ని నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేశారని, నేడు సీఎం జగన్ పాలన లో విశాఖ అభివృద్ధి చెందుతోందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కల్లబొల్లి మాటలు చెప్తే, సవతి తల్లి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మబోరని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్ని రోజులు విశాఖ కొండలు గీతం సంస్థలకు ఎప్పుడు కట్ట పెడదామని, ఉక్కు కర్మాగారం ఎవరికి ఇచ్చేద్దామని, బి హెచ్ పి వి ని ఎప్పుడు ఎల్ అండ్ టీ కి ఇచ్చేద్దామని తహతహలాడారు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మళ్లీ విశాఖ నగరంలో అభివృద్ధి కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.