విశాఖకు పోంచి ఉన్న డ్రగ్స్ భూతం ? రేవ్ పార్టీ కేసులో బయటపడుతున్న భయంకరమైన విషయాలు !
విశాఖలో డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయన్న విషయం తాజాగా విశాఖ బీచ్ ఫ్రంట్ రిసార్ట్ లో జరిగిన రేవ్ పార్టీతో వెలుగులోకి వచ్చింది. విశాఖలోనూ చాప కింద నీరులాగా డ్రగ్స్ ఆన్లైన్ లో సరఫరా అవుతుందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు తీగ లాగితే డొంకంతా కదులుతోంది. తాజాగా రుషికొండ సమీపంలోని బీచ్ ఫ్రంట్ రిసార్ట్లో నిర్వహించిన ఒక రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన నేపధ్యంలో అసలు ఈ డ్రగ్స్ మాఫియా ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు .
కబ్జాలపై కొరడా ...దేవుడి భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు .. ఇదే లాస్ట్ వార్నింగ్
రేవ్ పార్టీ ఘటనతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ సరఫరా వ్యవహారం
విశాఖ నగరానికి చెందిన సోను అనే వ్యక్తి రుషికొండలోని ఓ రిసార్ట్లో శనివారం రేవ్ పార్టీ పెట్టారు. అక్కడ సుమారు 50మంది యువకులు, పదిమంది యువతులు పార్టీలో పాల్గొన్నారు . పార్టీలో మద్యం తాగటానికి వీలుగా ఎక్సైజ్శాఖ నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే పార్టీలో మద్యంతోపాటు గోవా నుంచి తీసుకువచ్చిన ఎల్ఎస్డీ స్టిక్కర్లు, ఎండీఎంఏ పౌడరులాంటి అత్యంత మత్తు కలిగించే మాదక ద్రవ్యాలను అందుబాటులో ఉంచారు. అంతే కాక అనుమతి పొందిన సమయం దాటి విపరీతంగా డీజే సౌండ్స్తో పార్టీ నిర్వహించారు.హోరెత్తిపోయే శబ్దాలతో .. అసభ్యకర నృత్యాలతో రెచ్చిపోయిన యువతపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో .. పోలీసులు అక్కడికి చేరుకుని.. వారిని పంపించేసినట్టు సమాచారం.
రేవ్ పార్టీలే కాదు .. డ్రగ్స్ మత్తు కూడా .. కోడ్ లాంగ్వేజ్ లో డ్రగ్స్ సరఫరా
ఇక ఈ రేవ్ పార్టీల కల్చర్ పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో ఈ కేసుకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో అసభ్యకర నృత్యాలే కాదు డ్రగ్స్ వినియోగం జోరుగా సాగుతున్నట్టు గుర్తించారు . కోడ్ లాంగ్వేజ్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఆన్లైన్లోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. డ్రగ్స్ సరఫరా కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లు కూడా ఉన్నట్టు గుర్తించారు.
డ్రగ్స్ సరఫరా విషయంలో మరో ఇద్దరు అరెస్ట్ .. కాల్ డేటా ఆధారంగా విచారణ
ఇక తాజాగా విశాఖ నగరంలో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకునిందితుల కాల్ డేటా ఆధారంగా టాస్క్ఫోర్స్ పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ వీర రాఘవ అలియాస్ సోను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు సోను కోసం గాలింపు చేపట్టారు.ఇతర రాష్ట్రాల డ్రగ్స్ మాఫియాతో సోనుకు సంబంధాలున్నట్టు విచారణలో తేల్చారు. ఇదిలా ఉంటే ఈ పార్టీ లో మద్యానికి అనుమతి ఇచ్చిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావు వారం రోజుల సెలవుపై వెళ్ళారు.