భోగాపురం కారణంగా విశాఖ ఏయిర్ పోర్టు మూసేస్తారా: కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది..
ఉత్తరాంధ్రలో భోగాపురం ఏయిర్పోర్టు అందుబాటులోకి రాకముందే అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. విశాఖ విమానాశ్రయం పై భోగాపురం ఎఫెక్ట్ పడుతుందనే సందేహం వ్యక్తం అవుతోంది. ఇదే విషయం పై వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. అనుమానాలను నివృత్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది..
ఏపిలో కొత్తగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖపట్నం విమానాశ్రయం పై ఎటువంటి చర్యలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు యధావిధి ఆనే ఉంటాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేసారు. రాజ్యసభలో వైసిపి ఎంపీ విజయ సాయిరెడ్డి ఈ మేరకు ప్రశ్న అడిగారు. సమాధానంలో భాగంగా భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ గత నవంబర్ 26న జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.
విశాఖపట్నం లాంటి ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేస్తే దాని వలన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని మంత్రి పేర్కొన్నారు. దీని కారణంగా భోగాపుం విమనాశ్రాయం ప్రారంభం అయిన తరువాత కూడా విశాఖపట్నం ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలను కొనసాగించాని స్టీరింగ్ కమిటీ సిఫార్సు చేసిందని మంత్రి వెల్లడించారు.
భోగాపురం ఏయిర్పోర్టు నిర్మాణం పై కొద్ది కాలం క్రితం ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రాజకీయంగా విమర్శ లు వెల్లువెత్తాయి. అయితే, ప్రభుత్వం మాత్రం అక్కడ నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతోంది. రాజ్యసభలో కేంద్ర మంత్రి సైతం భోగాపురం ఏయిర్ పోర్టు కారణంగా విశాఖ విమానాశ్రయం పై ఎటువంటి ప్రభావం ఉండదని.. ఈ మేరకు ఏఏఐఈ సమాచారాన్నిఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీఎల్)కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వివరించారు.