విశాఖపట్నం విమానాశ్రయం మూత పడుతుందా? అనుమానాలు వద్దన్న కేంద్రం
Recommended Video
విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయం మూత పడుతుందంటూ కొద్దిరోజులుగా రాష్ట్రంలో వదంతులు వినిపిస్తున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తరువాత వైజాగ్ విమానాశ్రయాన్ని మూసివేస్తారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీన్ని బలపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ కొందరు ప్రముఖుల పేరిట ఇదే విషయం వెల్లడైంది. వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం పుల్ స్టాప్ పెట్టేసింది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ను మూసివేయబోమని స్పష్టం చేసింది.
భోగాపురం అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా దీన్ని కొనసాగిస్తామని భారత విమానాశ్రయాల ప్రాధీకార సంస్థ (ఎఎఐ) వెల్లడించింది. భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ కిందటేడాది నవంబర్ 26న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహద పడుతున్న విశాఖపట్నం వంటి భారీ ఎయిర్పోర్ట్ను మూసేయడం వలన దానిపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని గతంలో సందేహాలు వెలువడ్డాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలను కొనసాగించాలని స్టీరింగ్ కమిటీ సిఫార్సు చేసినట్లు ఎఎఐ వెల్లడించింది.
విశాఖపట్నం నుంచి ప్రతిపాదిత భోగాపురం విమానాశ్రయం మధ్య ఉన్న దూరం 45 కిలోమీటర్లు. ఇంత తక్కువ దూరంలో రెండు భారీ విమానాశ్రయాలు దేశంలో మరెక్కడా లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, భోగాపురం విమానాశ్రయాన్ని వ్యాపారపరంగా అభివృద్ధి చేస్తారని, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ను నౌకాదళ అవసరాల కోసం వినియోగిస్తారంటూ వార్తలు వచ్చాయి.
హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిన తరువాత బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ను మూసివేసిన విషయం తెలిసిందే. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ను కేవలం ప్రముఖుల రాకపోకలు, సైనిక అవసరాల కోసమే అందుబాటులో ఉంచారు. అదే తరహాలో విశాఖను కూడా మార్చుతారని వార్తలు వచ్చాయి. తాజాగా కేంద్రం ఇచ్చిన భరోసాతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడినట్టయింది.