మంత్రి అవంతి శ్రీనివాస్ డైరెక్షన్ మేరకు పోలీసుల నడుచుకుంటున్నారు: మాజీమంత్రి జవహర్
విశాఖపట్టణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. యాత్రకు అనుమతించకపోవడం ఏంటి అని టీడీపీ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. జగన్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. ఇది వైసీపీ రౌడీ బ్యాచ్ అసలు స్వరూపం అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మాజీమంత్రి జవహర్ కూడా వైసీపీ నేతలు, మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో పోలీసులకు మంత్రి అవంతి శ్రీనివాస్ సూచనలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి డైరెక్షన్ మేరకు పోలీసులు నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఓ ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత హోం మంత్రిపై లేదా అని ప్రశ్నించారు. విశాఖపట్టణంలో ప్రజా చైతన్య యాత్ర కోసం చంద్రబాబు నాయుడు 3 గంటల వరకు నిరీక్షించిన అనుమతి ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు వైఎస్ఆర్కు అనుమతి ఇవ్వకపోతే పరిస్థితి ఏంటీ అని అడిగారు. గత ప్రభుత్వ హయాంలో జగన్కు కూడా పర్మిషన్ ఇచ్చిన విషయాన్ని తెలిపారు. కానీ అధికారం చేపట్టిన సీఎం జగన్ మాత్రం.. ప్రతిపక్షాలను సాధించే కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు.