విశాఖలో అర్ధరాత్రి హైడ్రామా- పల్లా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ దీక్ష భగ్నం- ఆస్పత్రికి తరలింపు
విశాఖలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆరోగ్యం క్షిణించింది. దీంతో ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను స్ధానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు సాగుతున్న నేపథ్యంలోనే టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కూడా దీక్షకు కూర్చున్నారు. ఇప్పటికే ఆయన దీక్షకు టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. అయితే ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న పల్లా ఆరోగ్యం క్షీణించింది. ఇంకా ఆయన దీక్ష కొనసాగిస్తే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు కూడా తేల్చారు. దీంతో పల్లా శ్రీనివాస్ దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, గత 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి నేత @Pallasrinivas4u గారి దీక్షను జగన్ ప్రభుత్వం భగ్నం చేసింది. వాళ్ళు ఉద్యమాలు చేయరు, చేసే వారిని చేయనివ్వారు.(1/2)#JusticeForVizag#VisakhaUkkuAndhrulaHakku#VTooForVizag pic.twitter.com/tauNwvvqgb
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) February 16, 2021
అయినా పల్లా శ్రీనివాస్ పట్టువీడకపోవడంతో పోలీసులు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆయన దీక్షను భగ్నం చేశారు. తెల్లవారు జామును దీక్షాస్దలికి చేరుకున్న పోలీసులు.. కార్యకర్తల ప్రతిఘటన మధ్యలోనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పల్లా దీక్షచేస్తున్న శిబిరాన్ని తొలగించి ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు.
వాహనంలో తీసుకెళ్లే సమయంలో పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బలవంతంగా ఆసుపత్రికి తరలించినా, ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని పల్లా ప్రకటించారు.