ఏపీలో ఇసుక దోపిడీపై టీడీపీ పోరు- విశాఖలో విపక్ష నేతల హౌస్ అరెస్ట్లు
రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఇసుక దోపిడీకి నిరసనగా టీడీపీ అన్ని జిల్లాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. జిల్లాల్లోని గనులశాఖ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.
విశాఖ జిల్లాలో ఇసుక నిరసనలకు సిద్దమైన పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, అనకాపల్లి టౌన్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ రావు, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు మళ్ల సురేంద్రతో పాటు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
భీముని గుమ్మం జంక్షన్ లక్ష్మీనారాయణ నగర ఎంట్రన్స్ లో ఎన్టీఆర్ మార్కెట్ వద్ద పరమేశ్వరి పార్క్ జంక్షన్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను గనుల శాఖ కార్యాలయం వద్దకు వెళ్లకుండా రహదారులను నిర్బంధించారు
రాష్ట్రంలోని దాదాపు అన్ని నదుల్లో ప్రస్తుతం నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో ఇసుక తీయడం సాధ్యం కావడం లేదు. గతేడాది ఇసుక కొరత నేపథ్యంలో ఈసారి అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. వేసవిలోనే ఇసుక తీసి స్టాక్ ఉంచారు. అయినా సరిపోవకపోవడంతో పలు జిల్లాల్లో ఇసుక కొరత తప్పడం లేదు. దీంతో వైసీపీ సర్కారుపై మరోసారి ఇసుక విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. ఇదే అదనుగా టీడీపీ కూడా మిగతా విపక్షాలతో కలిసి పలు చోట్ల నిరసనలకు దిగుతోంది.