అమానవీయం: కరోనా భయం.. గర్భిణి అన్న కనికరం లేకుండా.. అంబులెన్సును అడ్డుకున్న గ్రామస్తులు
ఓవైపు కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతుంటే... మరోవైపు కరోనా భయం,అనుమానం అమానవీయ ఘటనలకు దారితీస్తోంది. కరోనా అనుమానం మనిషిని మనిషికి దూరం చేస్తోంది.తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణీ స్త్రీ కోసం వచ్చిన అంబులెన్సును గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక కాలినడకనే బయలుదేరిన ఆ గర్భిణీ గ్రామం దాటాక అంబులెన్సులో ఎక్కారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంబులెన్సులోనే ప్రసవించారు.
వివరాల్లోకి వెళ్తే... విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన జి.మాడుగుల మండలం పాల మామిడి గ్రామానికి చెందిన ఓ గర్బిణికి సోమవారం నొప్పులు వచ్చాయి. దీంతో అంబులెన్సుకు ఫోన్ చేశారు. అయితే గ్రామ సరిహద్దుల్లోనే గ్రామస్తులు అంబులెన్సును అడ్డుకున్నారు. కరోనా నేపథ్యంలో సరిహద్దు వద్ద ఒక గేట్ ఏర్పాటు చేసిన గ్రామస్తులు బయటివాళ్లను గ్రామంలోకి అనుమతించట్లేదు. ఇదే క్రమంలో అంబులెన్సును కూడా అనుమతించేది లేదని తెగేసి చెప్పారు.
చేసేది లేక ఆ గర్భిణి మహిళ నెమ్మదిగా నడుచుకుంటూ ఎలాగోలా గ్రామం సరిహద్దులో ఉన్న అంబులెన్సు వరకు వచ్చింది. అందులో ఎక్కడిన కాసేపటికే నొప్పులు తీవ్రమై ప్రసవించింది. వెంటనే అంబులెన్సు డ్రైవర్ వారిని ఆస్పత్రికి చేర్చగా ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. గర్బిణీ మహిళ పట్ల అమానవీయంగా వ్యవహరించిన ఆ గ్రామస్తుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్నిచోట్ల కరోనాపై లేని పోని అపోహలు మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ భర్త కరోనా సోకిందన్న కారణంతో తన భార్య రెండు చేతులు నరికి హత్య చేశాడు. అంతకుముందు,బిహార్లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన ఓ భార్యను ఆమె భర్తే హతమార్చాడు. కరోనా పట్ల ఇప్పటికీ క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవడం ఇలాంటి ఘటనలకు దారితీస్తోంది. కొంతమంది కరోనా భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా కలచివేస్తున్నాయి. మొత్తంగా కరోనా వైరస్ దేశంలో పెను విషాదాన్ని మిగులుస్తోంది.