లేట్ అయినా లేటెస్ట్గా: విశాఖ నుంచి పరిపాలనకు మరో ముహూర్తం తెర మీదికి: మరో లీక్
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ముహూర్తాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. అమరావతి నుంచి పరిపాలనను విశాఖపట్నానికి తరలించడానికి గత ఏడాది పొడవునా ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవి కొలిక్కి రాలేదు.చట్టపరమైన ఇబ్బందులు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు రాజ్ భవన్ ఆమోదముద్ర వేసినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేకపోయింది.
ఏప్రిల్ 13 నుంచి..
పరిపాలన రాజధానిగా విశాఖను బదలాయించే క్రమంలో ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్లింది. క్యాలెండర్ మారిందే తప్ప రాజధానిగా విశాఖపట్నం ఆవిర్భవించలేకపోయింది. కొత్త ఏడాదిలో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరో తేదీని ముందుకు తీసుకొచ్చింది. కొత్త సంవత్సరాది ఉగాది రోజైన ఏప్రిల్ 13వ తేదీ నుంచి విశాఖను పరిపాలన రాజధానిగా బదలాయించబోతోన్నట్లు లీకులు ఇచ్చింది. అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించడంలో ఇక ఏ మాత్రం జాప్యం చేయకూడదనే పట్టుదల ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోన్నట్లు చెబుతున్నారు.
ఈ సారి తగ్గేలేదేంటోన్న మంత్రులు..
విశాఖపట్న నుంచి పరిపాలనను సాగించే విషయంలో ఆ సారి వెనక్కి తగ్గేదేల లేదని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ తాజాగా దీనిపై లీకులు ఇస్తున్నారు. విశాఖ నుంచి పరిపాలనను సాగించడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదంటూ విశాఖకు చెందిన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థాన్ని సందర్శించిన అనంతరం ఆయన విశాఖలో పార్టీ నేతలతో కొద్దిసేపు సమావేశమైన సందర్భంగా దీని గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
క్యాంప్ ఆఫీస్గా పోర్ట్ గెస్ట్హౌస్..
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడనేది ఇంకా ఖచ్చితంగా ఖరారు కానప్పటికీ.. విశాఖ పోర్ట్కు చెందిన అతిథిగృహాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇదివరకే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ పోర్ట్ గెస్ట్హౌస్ను కూడా పరిశీలించారు. పోర్ట్ గెస్ట్హౌస్ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దీనికి వైఎస్ జగన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. అన్నీ కుదురుకున్నాయని, అందుకే రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడంలో ప్రభుత్వం జాప్యం చేయదలచుకోలేదని అంటున్నారు.
త్వరలో షిఫ్టింగ్..
సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడంలో జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పరిపాలనను విశాఖ నుంచే ఆరంభించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. భీమిలీ సమీపంలో మూతపడిన పైడా ఇంజినీరింగ్ కళాశాల భవన సముదాయాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చవచ్చంటూ ఇదివరకే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దాదాపుగా ఆ ఇంజినీరింగ్ కళాశాల భవనాన్నే సచివాలయంగా మార్చడానికి వైఎస్ జగన్ సుముఖతను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.