సీక్రెట్గా... మారువేషంలో అక్కడికి వెళ్లిన విజయనగరం కలెక్టర్..
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించడంతో కొన్నిచోట్ల కూరగాయల ధరలు భారీగా పెంచేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ స్వయంగా రంగంలోకి దిగారు. మారువేషంలో సాధారణ వినియోగదారుడిలా బహిరంగ మార్కెట్కి వెళ్లారు. అందరు కూరగాయాల వ్యాపారుల వద్దకు తిరుగుతూ ధరల గురించి ఆరా తీశారు. కొంతమంది వద్ద బేరమాడి కొనుగోలు చేశారు. మొత్తం మీద ఈ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా.. కూరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తున్నారని ధ్రువీకరించారు. కొంతమంది ఉల్లి,టమోటా కొంత ఎక్కువ ధరకు అమ్ముతున్నారని.. వారిని సున్నితంగా మందలించినట్టు చెప్పారు.
ఏపీలో నిత్యావసరాలు,కూరగాయల కొనుగోలు కోసం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ ఇంటికి రెండు కిలో మీటర్ల దూరంలోని ప్రాంతం నుంచే తీసుకువెళ్లాలని.. కుటుంబానికి అవసరమైన సరుకులన్నీ ఒకే వ్యక్తి తీసుకువెళ్లాలని ఆంక్షలు విధించారు.
నిత్యావసర సరుకుల కొరత, లాక్డౌన్ అమలు విషయంలో సమస్యలపై 1902 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. అలాగే విదేశీయుల కదలికలపై సమాచారం, వైద్య చికిత్సల వివరాల కోసం 104 టోల్ఫ్రీ ఏర్పాటు చేశారు.ఇప్పటివరకు ఏపీలో మొత్తం 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువమంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన మత ప్రార్థనలకు హాజరైనవారిగా గుర్తించారు. వారందరినీ ఐసోలేషన్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు.