విశాఖ ఏజెన్సీలో భయం..భయం: మావోయిస్టుల పోస్టర్లతో అలజడి: జగన్, చంద్రబాబుల పేర్లు..!
విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ విశాఖపట్నం ఏజెన్సీ గ్రామాల్లో తెలియని భయం వ్యాపించింది. ఎన్నికల ప్రక్రియ, ప్రచార కార్యక్రమాలు ఉధృతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గిరిజన గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కలకలం చెలరేగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమాయాత్తమౌతోన్న నేపథ్యంలో.. చోటు చేసుకున్న ఈ ఘటన వారిని వెనక్కి నెట్టుతోంది. ఈ భయాందోళనలకు కారణం- మావోయిస్టుల పోస్టర్లు.
పెదబయలు-కోరుకొండ దళం పేరుతో..
స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలంటూ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ఈ వాల్ పోస్టర్లు పుట్టుకొచ్చాయి. విజయనగరం సరిహద్దు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ పెదబయలు-కోరుకొండ సీపీఐ (మావోయిస్టు) ఏరియా కమిటీ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. పెదబయలు మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో రాత్రికి రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది.
మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్నట్టేనా?
తాజాగా వెలిసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల ఉనికి మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది. 2018 సెప్టెంబర్లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను హత్య చేసినప్పటి నుంచీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో తరచూ మావోయిస్టుల కదలికలు కనిపిస్తూనే వస్తున్నాయి. సరిహద్దుల్లోని ఒడిశా, ఛత్తీస్గఢ్లల్లో విస్తరించిన దట్టమైన దండకారణ్య ప్రాంతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని తరచూ తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు.
స్థానిక పోరు వేళ..
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు,.. ఈ పోస్టర్ల ద్వారా మరోసారి బహిర్గతం అయ్యాయి. బూటకపు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని, ప్రజాయుద్ధంలో భాగస్వామ్యులు కావాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. విప్లవ ప్రజా కమిటీల నిర్మించడానికి తమవంతు సహకారాన్ని అందించాలని సూచించారు. ఈ కమిటీల ద్వారానే నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికి బాటలు వేయాలని కోరుతున్నారు.
జగన్, చంద్రబాబులను ఓడించాలంటూ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్, చంద్రబాబు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవినీతి రహిత పాలన అంటూ గురివింద నీతిని పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో వేల కోట్ల రూపాయలను దోచుకున్నాడని, ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ఖర్చు పెడుతున్న లక్షలాది కోట్ల రూపాయలను ప్రభుత్వ అప్పుగా జగన్ మార్చేయబోతున్నాడని, పన్నుల రూపంలో పెనుభారాన్ని మోపబోతున్నారని చెప్పారు.
Recommended Video
మూడు రాజధానులతో మభ్య పెడుతూ.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడం, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్.. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సమస్యను తానే సృష్టిస్తున్నారని, ప్రజలను ఈ సమస్యల చుట్టూ గిరికీలు కొట్టేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రజల దృష్టిని మరల్చి వేల కోట్ల రూపాయలను దోచుకోవడానికి కుట్ర పన్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలను బహిష్కరించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.