రాళ్లు, కోడిగుడ్లు వేసినవారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, విశాఖ ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
విశాఖపట్టణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను అడ్డుకోవడంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. పోలీసుల తీరుపై హైకోర్టులో శుక్రవారం టీడీపీ నేతల తరఫున లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. చట్టం ముందు అందరూ సమానులే కదా అని ప్రశ్నించింది. అధికార పక్షానికి ఒక రూల్, ప్రతిపక్షానికి మరో నిబంధన ఉంటుందా అని ప్రశ్నించింది.
చంద్రబాబు పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని పోలీసులను ప్రశ్నించింది. తొలుత అరెస్ట్ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయాల్సిన ఆందోళనకారులను కదా అని పోలీసులను ప్రశ్నించింది. ఆందోళనకారులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని అడిగింది. వారిని వదిలేసి.. చంద్రబాబును ఎందుకు నిర్బంధించారని నిలదీసింది. వందలమందిని ఎయిర్ పోర్టులోకి ఎలా అనుమతించారని పోలీసు శాఖకు అడిగింది.
Recommended Video
గురువారం విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన ఘటనకు సంబంధించిన పిటిషన్ విచారణ వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీ, విశాఖపట్టణం పోలీసు కమిషనర్ను హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేసిన రోజే తాము కేసు విచారణ చేపడుతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.