గాజువాక శీను: విశాఖ యువకులను నిలువునా ముంచాడు!
విశాఖపట్నం: జీవనోపాధిని వెదుక్కుంటూ తనను నమ్మి దేశం కాని దేశానికి వెళ్లిన నలుగురు తెలుగు యువకులను నిలువునా ముంచేశాడు ఓ ఏజెంట్. ఆ ఏజెంట్ కూడా తెలుగువాడే. బాధిత యువకులకు పరచయం ఉన్నవాడే. బాధితుల పాస్పోర్టుల లాక్కుని తరిమేయడంతో.. ఎటు వెళ్లాలో? ఎక్కడికెళ్లాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. మలేషియాలోని తెలుగు భవనంలో తలదాచుకుంటున్నారు.
విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన మరిశా వెంకునాయుడు, మరిశా మహేష్, మరిశా గిరీష్, మరిశా శ్రీనివాసరావు, మరిశా గోవింద్, జామి నూకరాజు అనే యువకులకు విశాఖ శివార్లలోని గాజువాకకు చెందిన కర్రి శ్రీను అనే ఏజెంట్ పరిచమయ్యాడు. గాజువాక శీనుగా గుర్తింపు ఉన్న అతను విదేశాల్లో ఉద్యోగాలను కల్పించే ఏజెంట్గా పనిచేస్తున్నాడు. మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని అతను రాజాం యువకులను నమ్మించాడు. వారి వద్ద నుంచి 60 వేల రూపాయల చొప్పున వసూలు చేశాడు. గత ఏడాది సెప్టెంబర్లో బాధిత యువకులను టూరిస్టు విసాపై మలేషియా తీసుకువెళ్లాడు. తమిళనాడుకు చెందిన ధనశేఖర్ అనే మరో ఏజెంట్కు వారి బాధ్యతలను అప్పగించాడు.
కొట్టిన కొబ్బరికాయ చిప్ప ఎగిరిపడి.. ఎంబీఏ విద్యార్థిని మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు
మలేషియాకు వెళ్లిన రాజాం యువకులకు ఉపాధి కల్పించలేదు. రెండు నెలలైనప్పటికీ చేయడానికి ఎలాంటి పనులు లేవు. ఫలితంగా- వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఈ ఆరుమందినీ ఓ అపార్ట్మెంట్లోని చిన్న గదిలో ఉంచి నిత్యం నరకం చూపిస్తున్నారు ఆ దుర్మార్గులు. ఆ బాధలు పడలేక మరిశా గోవింద్, జామి నూకరాజు ఏజెంట్ల బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. మరో నలుగురు అక్కడే ఉండిపోయారు.
తాజాగా వీసా గడువు కూడా ముగిసిపోవడంతో నలుగురు యువకులు స్వదేశానికి రావడానికి ప్రయత్నాలు చేయగా మలేషియా ఏజెంట్ వారి పాస్పోర్టులను లాక్కుని చింపేశాడు. వారు బయటకు వస్తే తమ బండారం బయటపడుతుందన్న ఆందోళనలో ఆ నలుగురిని అక్కడే బంధించాడు. సరిగ్గా భోజనం కూడా పెట్టకపోవడంతో చిరుతిళ్లు, నీళ్లు తాగి కాలం వెళ్లదీస్తున్నారు. మరిశా వెంకునాయుడు, మహేష్ ఇద్దరూ అన్నదమ్ములు. తమ ఇద్దరు పిల్లలు మలేసియాలో దీనస్థితిలో కాలం వెల్లదీస్తున్న విషయాన్ని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మలేసియాలో చిక్కుకున్న యువకులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను వేడుకుంటున్నారు.