పోకిరి అరాచకం : రాత్రిపూట.. ఆ రోడ్లలో ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు... ఎట్టకేలకు అరెస్ట్...
ఒంటరి మహిళలే అతని టార్గెట్... రాత్రిపూట ఒంటరిగా నడిచివెళ్తున్నవారిని బైక్పై వెంబడిస్తాడు. వారి ప్రైవేట్ పార్ట్స్పై అసభ్యంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందుతాడు. ఒకవేళ వాళ్లు తిరగబడితే అక్కడినుంచి పరారవుతాడు. చాలారోజులుగా ఇలాగే మహిళలను వేధిస్తున్న అతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో... పోలీసులు అతనిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. విశాఖలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఎవరా నిందితుడు...
విశాఖపట్నంలోని కలెక్టరేట్ అఫీషియల్ కాలనీలో రాంబాబు అనే యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. దండుబజార్లోని ఓ షిప్పింగ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నైట్ షిఫ్టు ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో మార్గమధ్యలో అమ్మాయిలను వేధించడం సరదాగా మార్చుకున్నాడు. ఆర్టీసీ కాంప్లెక్స్,సాగర తీరంలో ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు... బైక్పై వారిని వెంబడించి..వారి శరీర భాగాలను అసభ్యంగా తాకేవాడు. ఒకవేళ వాళ్లు తిరగబడితే అక్కడినుంచి పరారయ్యేవాడు. లేదంటే... వాళ్లను అలాగే వేధిస్తూ కొద్దిసేపు పైశాచికానందం పొందేవాడు.
ఎట్టకేలకు అరెస్టు...
ఇదే క్రమంలో జూలై 24,30వ తేదీల్లో రాత్రిపూట బీచ్ రోడ్డులో ఒంటరిగా నడిచి వెళ్తున్న ఇద్దరు యువతులను రాంబాబు వేధించాడు. వాళ్లను అసభ్యంగా తాకి వెకిలిగా ప్రవర్తించాడు. దీంతో బాధితులు మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన మహారాణిపేట పోలీసులు కేసును దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బీచ్రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ , జగదాంబ జంక్షన్ , రైల్వే స్టేషన్ వద్ద మఫ్టీలో రాంబాబు కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో సోమవారం(అగస్టు 1) ఎట్టకేలకు బీచ్ రోడ్డులోనే పోలీసులకు అతను పట్టుబడ్డాడు. బాధితురాలి సాయంతో అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
Recommended Video
యువతుల్ని అభినందించిన సీపీ...
నిందితుడు రాంబాబుపై పోలీసులు దిశా చట్టం కింద కేసు నమోదు చేశారు. నిజానికి రాంబాబు చేతిలో వేధింపులకు గురైన ఎంతోమంది ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఎట్టకేలకు ఇద్దరు యువతులు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అభినందించారు. మహిళలు ధైర్యంగా ఉండాలని... ప్రతీ ఒక్కరూ దిశా యాప్ని డౌన్ లోడ్ చేసుకోవాలని సీపీ ఆర్కే మీనా సూచించారు. వారం రోజుల్లో అతనిపై చార్జిషీట్ దాఖలు చేస్తామని స్థానిక పోలీసులు చెప్పినట్లు సమాచారం. అటు నిందితుడు రాంబాబు విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం.