వైన్ షాపులు తెరవడమే ఆలస్యం.. విశాఖలో మద్యం మత్తులో ఓ హత్య..
దాదాపు నెలన్నర రోజుల పాటు కొనసాగిన పూర్తి స్థాయి లాక్ డౌన్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. క్రైమ్ రేటు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో.. అక్కడక్కడా చోరీలు తప్పితే.. హత్యా ఘటనలు చాలా తక్కువగా నమోదయ్యాయి. కానీ మద్యం షాపులు తెరిచీ తెరవడంతోనే విశాఖపట్నంలో ఓ హత్య కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు బతుకుదెరువు కోసం విశాఖపట్నం వచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. ఇసకతోట బస్టాప్ వెనుక ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో వీరు నివాసం ఉంటున్నారు. సోమవారం(మే 4) మద్యం షాపులు తెరవడంతో ఇద్దరూ వెళ్లి మద్యం తెచ్చుకున్నారు. కలిసి మద్యం సేవించారు.
ఇదే క్రమంలో డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటా మాటా పెరగడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. బలమైన గాయాలు కావడంతో అందులో ఒకరు అక్కడే కుప్పకూలి మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.