పట్టించుకోని వైసీపీ- మిత్రుల్ని దూరం చేస్తున్న టీడీపీ- రెంటికీ చెడ్డ రేవడిగా గంటా పరిస్ధితి..
ఒకప్పుడు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి విశాఖ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కు అధికార పార్టీల్లోనే ఉంటారనే పేరుండేది. గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాస్ ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. దీంతో వైసీపీలో చేరిపోవడం ఖాయమని పలుమార్లు వినిపించింది. అందుకు తగినట్లుగానే తెరవెనుక ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఆయనకు వ్యతిరేకంగా విశాఖ వైసీపీలో కొత్తగా తయారైన లాబీ పనిచేయడంతో వారి మాటే నెగ్గింది. అదే సమయంలో పార్టీకి దూరంగా ఉంటూ పక్కచూపులు చూస్తున్న గంటా శ్రీనివాస్కు ఆయన అనుచరులను దూరం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
గంటా పిల్లిమొగ్గలు...
2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన ప్రతికూల పరిస్ధితుల్లోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాస్ సాగర నగరంలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారని అంతా భావించారు. కానీ గతంలో వరుసగా పార్టీలు మారిన అనుభవం ఉన్న గంటా వెంటనే వైసీపీ వైపూ చూడలేదు. ఇటు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, అటు వైసీపీకి వెళ్లకుండా మౌనంగా ఉండిపోయారు. 2019 ఎన్నికలకు ముందే టీడీపీ అధిష్టానంపై అలిగి ఇంటికే పరిమితం అయిపోయిన గంటా.. ఈసారి కూడా అలాగే అలిగి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఏడాది తిరిగే లోపే గంటా శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైసీపీలో చక్రం తిప్పుతున్న కొందరు కీలక నేతలతో టచ్లోకి వెళ్లి ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక గంటా వైసీపీలో చేరడమే తరువాయి అన్న సమయంలో అనూహ్యంగా ఈ కార్యక్రమం రద్దయిపోయింది.
గంటా ఎంట్రీకి బ్రేక్ వెనుక ఆ ఇద్దరు...
మూడు రాజదానుల ఏర్పాటు నేపథ్యంలో విశాఖలో మారిన పరిస్ధితుల్లో వైసీపీలోకి వెళ్లడం ద్వారా చక్రం తిప్పాలని గంటా భావించారు. కానీ పరిస్ధితులు మాత్రం అందుకు అనుకూలించలేదు. ఇందుకు ఇద్దరు వ్యక్తులు కారణంగా తెలుస్తోంది. ఇందులో ఒకరు ఒకప్పటి గంటా అనుచరుడు, జగన్ కేబినెట్ మంత్రి అవంతి శ్రీనివాస్. మరొకరు గంటా చేతిలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన కేకే రాజు. వీరిద్దరూ ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి సన్నిహితులే. గంటా ఎంట్రీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియగానే వీరిద్దరూ రంగంలోకి దిగారు. సాయిరెడ్డి ద్వారా ఒత్తిడి పెంచారు. చివరికి గంటా ఎంట్రీకి బ్రేక్ పడక తప్పలేదు.
గంటాకు మిత్రుల్ని దూరం చేస్తున్న టీడీపీ..
టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాస్ ఏదో ఒక రోజూ జంప్ కావడం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయనకు పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వలేదు. అంతటితో సరిపెట్టకుండా ఆయన చుట్టూ ఉన్న వారు, గంటాతో పాటు పార్టీ మారతారని భావిస్తున్న వారికి తాజాగా పదవులిచ్చారు. ఇందులో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో పాటు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా ఉన్నారు. వీరికి ఏకంగా పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యతలే అప్పజెప్పారు. తద్వారా గంటాతో పాటు పార్టీ మారకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. ఇప్పటికే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీకి జై కొట్టడంతో గణబాబుకు పదవి ఇవ్వడం ద్వారా మరో ఎమ్మెల్యే ఫిరాయించకుడా జాగ్రత్తపడినట్లయింది.
బీజేపీలోకి వెళ్లేందుకు అనుకూలించని పరిస్దితులు
వైసీపీ కరుణించక, టీడీపీలో ఉండలేక ఇబ్బందులు పడుతున్న గంటా శ్రీనివాస్ బీజేపీవైపు చూస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు కూడా సామాజిక వర్గం కోణంలో గంటాను పార్టీలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు వైసీపీకి మద్దతిస్తే ఫర్వాలేదు కానీ బీజేపీలో చేరితే లేదా మద్దతిస్తే వైసీపీ, టీడీపీ కలిసి తనపై అనర్హత వేటు వేయిస్తాయనే భయం గంటాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నుంచి గంపగుత్తగా ఎమ్మెల్యేలు వస్తే మాత్రం వారితో కలిసి బీజేపీ గూటికి వెళితే బెటరన్న ఆలోచనలో ఆయన ఉన్నారని ప్రచారం జరుగుతోంది. విశాఖలో బీజేపీ పరిస్ధితి కూడా అంతంతమాత్రంగానే ఉన్న పరిస్ధితుల్లో వెంటనే ఎంట్రీ ఇచ్చినా ఎటువంటి లాభం ఉండబోదని ఆయన అంచనా వేసుకుంటున్నారు.