లాక్ డౌన్ వేళ విశాఖలో వైసీపీ రాజకీయం- టార్గెట్ అవేనా... ?
ఏపీలో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. దీనిపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేస్తున్న అధికార వైసీపీ నేతలు.. లాక్ డౌన్ ఉల్లంఘనలపై మాత్రం నోరు మెదపడం లేదు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ విశాఖ జిల్లాలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా తిరుగుతుండటం వెనుక వ్యూహమేంటన్న దానిపై ప్రస్తుతం జనంలో చర్చ సాగుతోంది.
విశాఖలో సాయిరెడ్డి పాగా- లాక్ డౌన్ లోనూ..
కొన్నేళ్లుగా విశాఖపట్నం జిల్లాలో తిరుగుతూ స్ధానికంగా రాజకీయాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చడంలో విజయవంతమైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... తాజాగా లాక్ డౌన్ సమయంలోనూ అక్కడ హల్ చల్ చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ అధికార పార్టీ నేత కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో అనుకున్నదే తడవుగా రక్తదాన శిబిరాలు, కూరగాయల పంపిణీలతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో సాయిరెడ్డి తీరు ఓ రేంజ్ లో చర్చనీయాంశంగా మారుతోంది.
వైసీపీ వ్యూహాలకు పదును..
రెండు రోజుల క్రితం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రక్తదాన శిబిరంలో పాల్గొన్న సాయిరెడ్డి, ఇవాళ మంత్రి అవంతి శ్రీనివాస్ తో కలిసి కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. నిత్యం జనంలో ఉండేందుకు సాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు మంచివే అయినా ప్రస్తుతం ఇందుకు తగిన సమయం కాదనేది అందరూ చెబుతున్న మాట. కానీ సాయిరెడ్డి ఇవేవీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు. దీని వెనుక భారీ వ్యూహమే రచిస్తునట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. కరోనా ప్రభావం తగ్గగానే రాజదాని తరలింపు కోసం జగన్ సర్కార్ ప్రయత్నించే అవకాశముంది. అదే సమయంలో మధ్యలోనే నిలిచిపోయిన స్ధానిక ఎన్నికలు ఎలాగో ఉన్నాయి. ఈ రెండు అంశాలే ఇప్పుడు సాయిరెడ్డిని నిత్యం విశాఖ ప్రజల మధ్య తిరిగేలా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.
Recommended Video
కరోనా కేసుల తగ్గింపుపైనా...
విశాఖలో గత రెండు వారాల్లో విశాఖ జిల్లాలో ఒకే ఒక్క కేసు నమోదైంది. అదీ విపక్షాల విమర్శల నేపథ్యంలోనే. దీంతో సహజంగానే విశాఖలో ఏం జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాఖకు రాజధానిని తరలించే క్రమంలోనే కేసుల సంఖ్యను తక్కువచేసి చూపపుతున్నట్లు టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతల రాజకీయ పర్యటనలు, హంగామా తోడవుతోంది. దీంతో కరోనా లాక్ డౌన్ లోనూ సాగర తీరం వేడెక్కుతోంది. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నా వైసీపీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. కేసుల సంఖ్య తగ్గించి చూపుతున్నారన్న టీడీపీ విమర్శలకు వైసీపీ దగ్గర సరైన సమాధానం లేదు. కరోనా లెక్కలపై సవాల్ కు సిద్ధమని మంత్రి అవంతి ప్రకటించడం మినహా వాస్తవాలపై చర్చ లేదు. దీంతో లాక్ డౌన్ ఉల్లంఘించి మరీ వైసీపీ రాజకీయానికి తెరలేపుతోందన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి.