లాక్డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్ల పాదాలను మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే..భావోద్వేగం
విశాఖపట్నం: ఒకవంక భయానక కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ.. మొక్కవోని దీక్షతో విధుల్లో పాల్గొంటున్నారు పోలీసులు. కరోనా వైరస్ అలముకున్న వాతావరణంలో సామాన్య ప్రజలు ఎవ్వరూ దాని బారిన పడకూడదనే ఉద్దేశంతో 24 గంటల పాటు విధులను నిర్వరిస్తుననారు. కుటుంబాలను వదిలి రోడ్డెక్కారు. ప్రజలు రోడ్డెక్కకుండా కాపాడుతున్నారు. ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నప్పటికీ.. లెక్క చేయట్లేదు.
ఏపీ, తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. వేలాదిమంది పోలీసులు భార్యా, పిల్లలను వదిలేసి లాక్డౌన్ డ్యూటీలకు హాజరవుతున్నారు. అన్నార్తులను ఆదుకోవడానికీ వెనుకాడల్లేదు. ఆకలితో అలమటిస్తోన్న వారికి తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. మంచినీరు కూడా అందుబాటులో లేని వాతావరణం మధ్య పోలీసులు చిత్తశుద్ధితో లాక్డౌన్ విధులకు హాజరవుతున్నారు.
అత్యంత గడ్డు పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచిన పోలీసులపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వర్షం కురుస్తోంది. పోలీసుల రుణం తీర్చుకోలేమని అంటున్నారు నెటిజన్లు. అదే క్రమంలో- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసన సభ్యుడు చెట్టి ఫల్గుణ లాక్డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసుల కాళ్లు మొక్కారు. విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఉదయం ఆయన తన నియోజకవర్గంలోనిపలు ప్రాంతాల్లో పర్యటించారు. లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా అరకులో ఛెట్టి ఫల్గుణ కొందరు పోలీసులతో మాట్లాడారు. వారికి కనీస సౌకర్యాలు అందుతున్నాయా? లేవా? అని అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల పాటు కష్టపడక తప్పదని చెప్పారు. పోలీసులతో మాట్లాడుతుండగానే.. భావోద్వేగానికి గురయ్యారు. పోలీసు కానిస్టేబుళ్ల పాదాలను నమస్కరించారు. అనుకోని ఈ ఘటనతో పోలీసులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఫల్గుణకు సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.