వైసీపీ ఎంపీ, పీసీసీ చీఫ్ మధ్య వాగ్వివాదం: హీరో అవుదామంటే కుదరదంటూ ఫైర్
విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై కొనసాగుతోన్న ఉద్యమాలు వేడెక్కుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు వేర్వేరు రూపాల్లో తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గురువారం విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. రాజకీయాలతకు అతీతంగా ఏకం అయ్యారు. ఒకే వేదికపైకి చేరారు. దీనికి కొనసాగింపుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం పాదయాత్రను నిర్వహించ తలపెట్టింది. 25 కిలోమీటర్ల దూరం పాటు ఈ పాదయాత్ర సాగనుంది.
నిమ్మగడ్డ మార్క్ ఫైర్: మున్సిపల్ ఎన్నికలకు ముందే: గ్రేటర్ విశాఖ కమిషనర్పై బదిలీ వేటు
పాదయాత్రలు చేస్తే సరిపోతుందా?.
వైఎస్సార్సీపీ నిర్వహించ తలపెట్టిన పాదయాత్రపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీమంత్రి సాకె శైలజానాథ్ విమర్శలను గుప్పించారు. కూర్మన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. పాదయాత్రల ద్వారా స్టీల్ ప్లాంట్ను కాపాడలేరని, రాజకీయ పరమైన ఒత్తిళ్లను కేంద్ర ప్రభుత్వంపై తీసుకుని రావాల్సి ఉంటుందని చెప్పారు. వాకింగ్లు, జాగింగ్లతో ఉపయోగం ఉండబోదని అన్నారు. ఇదే సమావేశానికి హాజరైన వైసీపీకి చెందిన విశాఖపట్నం లోక్సభ సభ్యుడు ఎంవీవీ సత్యానారాయణ.. శైలజానాథ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తిడితే సమస్య పరిష్కారమౌతుందా?..
ఒకరిని తిట్టడానికో.. మరొకరిని విమర్శించడానికో తాము ఇక్కడికి రాలేదని అన్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి పాదయాత్ర మాత్రమే కాదు.. అవసరమైతే రోడ్లపై పడుకుంటామని చెప్పారు. శైలజానాథ్కు విశాఖ పరిస్థితులు, స్టీల్ ప్లాంట్ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఒకరు తలపెట్టిన కార్యక్రమాలను విమర్శించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. విమర్శలు చేయడం ద్వారా హీరోలవుదామనుకుంటే కుదరదని శైలజానాథ్ను ఉద్దేశించి హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమనే ఒకటే లక్ష్యం.. ఒకటే ధ్యేయం తమకు ఉందని ఉండాలని అన్నారు.
ఢిల్లీకి నిరసన గళాన్ని వినిపించడానికే..
పాదయాత్ర చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలరా? అంటూ శైలజానాథ్ ప్రశ్నించారని, అలా మాట్లాడటం ఆయనకు తగదని చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకోవడానికి అవసరమైతే రోడ్లపైనా పడుకుంటామని ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏఏ రూపాల్లో నిరసనలను తెలియజేయాలో.. అన్ని రూపాల్లోనూ తాము నిరసనలను తెలియజేస్తామని, తమ గళాన్ని ఢిల్లీకి వినిపింపజేస్తామని అన్నారు. తమను ఎందుకు అడ్డకునే ప్రయత్నం చేస్తోన్నారని నిలదీశారు.
మీరేం చేశారు?
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించడానికి ఇంతకూ కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలంటూ ఎంవీవీ సత్యనారాయణ ప్రశ్నించారు. పార్లమెంట్లో వందమందికి పైగా సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కనీసం ఒక్కసారయినా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందా? అంటూ నిలదీశారు. తెలుగు ప్రజలు జీవితంలో మరిచిపోలేని తప్పులను కాంగ్రెస్ చేసిందని, రాష్ట్రాన్ని రెండుగా విభజించారని ఆయన శైలజానాథ్పై ఘాటు ఆరోపణలు చేశారు. రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది వేదిక కాదంటూ సూచించారు. కాంగ్రెస్కు ఓటు వేయాలంటూ ఇక్కడి నుంచి అడగడం సరికాదని ఎంవీవీ అన్నారు.