విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సీక్రెట్ ఇదే- 1300 కోట్లకే అమ్మకం ? సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుకు ఉన్న సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. అయితే కేంద్ర ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా నష్టాల పేరుతో ఈ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక నష్టాల కంటే కూడా మరో పెద్ద కారణం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ గనులు కేటాయిస్తే సరిపోయే దానికి లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు ప్రైవేటీకరణ కోసం కేంద్రం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక అసలు రహస్యాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టారు.
KA PAUL :మళ్లీ తెరపైకి కేఏ పాల్- విశాఖ ఉక్కు ఉద్యమంలోకి- హైకోర్టులో పిటిషన్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మంటలు
విశాఖ పట్నంలోని ప్రభుత్వ రంగ సంస్ధ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణ కోసం కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీలో అగ్గి రాజేస్తోంది. అసలే విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు పేరుతో ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయం జనంలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. దీంతో రాష్ట్లంలో వైసీపీ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకూ ఆ సెగ తాకుతోంది. ఇదే కోవలో తమపై పెరుగుతున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అఖిలపక్ష కార్మిక సంఘాల భేటీ పెట్టి మరీ దీని వెనుక రహస్యాన్ని బయటపెట్టేశారు.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ సీక్రెట్ చెప్పేసిన సాయిరెడ్డి
విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరించాలన్న నిర్ణయం వెనుక అసలు కారణాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా బయటపెట్టారు. అఖిలపక్ష కార్మికసంఘాలతో నిర్వహించిన భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి... పొరుగు రాష్ట్రానికి చెందిన అధికారులు, కేంద్రంలోని పెద్దలతో కలిసి ఈ కుట్ర పన్నారంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీతో పాటు ఇతర పార్టీల్లోనూ కలకలం రేపుతున్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం తర్వాత వైసీపీ ఎదుర్కొంటున్న ఒత్తిడి ఏ స్ధాయిలో ఉందన్నది కూడా సాయిరెడ్డి కామెంట్స్తో వెల్లడైంది.
ప్రైవేటీకరణ వెనుక ఒడిశా హస్తం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక ప్రధాన కారణం పొరుగు రాష్ట్రమైన ఒడిశాయే అన్నది విజయసాయిరెడ్డి ప్రధాన ఆరోపణ. ఇందుకు ఆయన కొన్ని ఆధారాలను కూడా చూపారు. స్టీల్ ప్లాంట్లో ఒడిశాకు చెందిన కొందరు అధికారుల పాత్ర వల్లే సంస్ధ నష్టాల బాటలోకి వెళ్లిందన్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖలోనూ ఒడిశా అధికారుల పాత్ర ఉందన్నారు. స్టీల్ ప్లాంట్లో కీలక స్ధానాల్లో ఉన్న ఒడిశా అధికారులు స్ధానిక హక్కులను కాలరాశారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. దీంతో ఒడిశా అధికారుల నిర్వాకం వల్లే ఇప్పుడు ప్రైవేటీకరణ దుస్ధితి తలెత్తిందన్నారు.
స్టీల్ ప్లాంట్ నష్టాల వెనుక మూడు కారణాలు
గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న మూడు ఘటనలు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇందులో రాయ్బరేలీకి చెందిన రైలు చక్రాల కర్మాగారం కోసం స్టీల్ ప్లాంట్కు చెందిన రూ.2 వేల కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఒడిశా మైనింగ్ కార్పోరేషన్లో పదేళ్ల క్రితం రూ.381 కోట్లు పెట్టుబడితే పెడితే ఖనిజం రాకపోగా.. వెయ్యికోట్ల పెనాల్టీ కట్టాల్సి వచ్చిందన్నారు. అలాగే ప్లాంట్లో టేకే బాండ్ అనే అధికారి రూ.2 వేల కోట్ల స్కాం చేస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఈ మూడు కారణాల వల్లే స్టీల్ ప్లాంట్ రూ.5361 కోట్లు నష్టపోయిందన్నారు.
రూ.1300 కోట్లకే స్టీల్ ప్లాంట్ అమ్మకం ? భారీ కుట్ర
కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత స్టీల్ ప్లాంట్న స్వాధీనం చేసుకునేందుకు కేంద్రంలోని పెద్దలు, పారిశ్రామికవేత్తలు, కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్షానూ, ఎంపీలతో కలిసి ప్రధానినీ కలిసి వాస్తవ పరిస్దితులను వివరిస్తామని సాయిరెడ్డి తెలిపారు. కేంద్రం రూ.1300 కోట్లకే స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెడితే విశాఖ వాసులు చందాలు వేసుకుని తీసుకుంటారని సాయిరెడ్డి వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ను బయటి వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.