ఆంధ్రా ఊటీ లూటీ, రాయలసీమ రౌడీలు వస్తారని విషం, విశాఖ పార్ట్-2లో విజయసాయిరెడ్డి
వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. విశాఖ కంఠకుడు పార్ట్-2లో జిల్లాకు చేసిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. చంద్రబాబు కుట్రలో విశాఖపట్టణం జిల్లా విచ్ఛిన్నమైందని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదని మండిపడ్డారు. ఆంధ్రా ఊటీని లూటీ చేసి.. ఇప్పుడు కొత్త కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న తొలి దఫా తొమ్మిదేళ్లు ఏమీ చేయలేదని.. గత ఐదేళ్ల హయాంలో కూడా కాలం వెళ్లదీశారని ఫైరయ్యారు.
పెట్టుబడుల సదస్సు పేరుతో హడావిడి..
విశాఖకు సదుపాయాలు ఉన్నాయని పెట్టుబడుల సదస్సులతో నానా హడావుడి చేశారని గుర్తుచేశారు. అయితే కొందరు ముందుకురాగా తమ రియల్ ఎస్టేట్ వెంచర్లో పెట్టాలని చెప్పడంతో ఎంవోయూ కుదిరినవాటిలో రెండు శాతం పెట్టుబడులు కూడా రాలేదని చెప్పారు. సముద్రం చీలిపోతుందని ఒకసారి, విశాఖ రాజధాని అయితే రాయలసీమ రౌడీలు వస్తారని విషం కక్కాడని మండిపడ్డారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాయలసీమ రౌడీలు విశాఖ వస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం చేశాడని గడుర్తుచేశారు.
ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని వెక్కిరించి...
విశాఖకు విమ్స్ అంకురార్పణ చేసింది వైఎస్ఆర్ అని తెలిపారు. విశాఖలో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాననే హామీని గాలికొదిలేశాడని మండిపడ్డారు. జిల్లాకు ఒక వర్సిటీ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ భావించి.. సక్సెస్ అయ్యారని తెలిపారు. 14 ఏళ్ల పాలనలో ఒక్క వర్సిటీ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. తన హయాంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వెక్కిరించి, ఎగతాళి చేశాడని ధ్వజమెత్తారు. తుపాను వచ్చిన సమయంలో మాత్రం పబ్లిసిటీ స్టంట్ల కోసం మాత్రం తాపత్రాయపడ్డారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో విశాఖ ఐటీలో 18 వేల ఉద్యోగులు ఉండేవారు అని తెలిపారు. కానీ అదీ చంద్రబాబు సమయానికి 12 వేలకు పడిపోయాయిందని గుర్తుచేశారు. పెరగాల్సింది ఉద్యోగులు ఎందుకు తగ్గిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భూ కుంభకోణంపై 3 వేల ఫిర్యాదులు,, అప్పటి మంత్రులపై..
ఓటమి భయంతో జీవీఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించని ఘనుడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. విశాఖకు బాబు చేసిందేమీ లేదని.. వేలాది ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. 2017లో లక్ష ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులు మాయం చేశాడని విమర్శించారు. విశాఖ ప్రజలు తిరగబడే పరిస్థితి రావడంతో... భూ కుంభకోణంపై సిట్ వేసి తప్పించుకొనే ప్రయత్నం చేశాడని సాయిరెడ్డి పేర్కొన్నారు. కానీ దానిపై 3 వేల ఫిర్యాదులు వచ్చాయని.. విశాఖ జిల్లాకు చెందిన అప్పటి మంత్రులపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పేదల కోసం ఒక్క కాలనీ ఏర్పాటు చేయని బాబు.. అనుచరులకు మాత్రం వేలాది ఎకరాలు దోచిపెట్టాడని ఫైరయ్యారు.
Recommended Video
పట్టిసీమ పేరుతో తెగ హడావిడి చేసి..
2018లోనే పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడని.. కానీ పూర్తి చేయలేదని గుర్తుచేశారు. తర్వాత పట్టిసీమ అని తెగ హడావుడి చేసి గోదావరి నీరును అటు మళ్లించాడని పేర్కొన్నారు. విశాఖ గొంతు తడిపేందుకు మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖకు సముద్రం ఒక వరం అని.. ఆ నీటిని మంచినీరుగా మార్చి పారిశ్రామిక అవసరాలకు వాడుకునేందుకు ఇజ్రాయెల్ దేశంతో కలిసి డీశాలినేషన్ ప్లాంట్కు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఆయా సమావేశాల్లో అబద్దాలు చెప్పడం.. మీడియా ముందు వాగడం తప్ప.. విశాఖకు చంద్రబాబు చేసిందేమీ లేదు.. కానీ అబద్దాలు చెప్పి కాలం వెళ్లారని మండిపడ్డారు.