రాష్ట్రానికి మరో వరం?: అనూహ్యంగా తెరపై వాల్తేర్ డివిజన్: ఏపీ సెంటిమెంట్ ను గౌరవిస్తామన్న కేంద్రం!
విశాఖపట్నం: విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ గా ఏర్పడిన తరువాత కనుమరుగైన వాల్తేర్ డివిజన్.. అనూహ్యంగా తెరపైకి వచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటు చేసిన తరువాత వాల్తేర్ డివిజన్ రద్దయింది. వాల్తేర్ డివిజన్ను యధాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇదివరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు సైతం కొనసాగాయి. వాల్తేర్ డివిజన్ ను రద్దు చేసి, కొత్తగా రాయగడ డివిజన్ ను అప్పట్లో ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 125 సంవత్సరాల ఘన చరిత్ర గల వాల్తేర్ డివిజన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకుని రాగలదు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు ఒత్తిడి తీసుకొస్తారనే చర్చ ఉత్తరాంధ్ర వాసుల్లో వ్యక్తమైన విషయం తెలిసిందే. దీన్ని నిజం చేసేలా.. కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇందులో భాగంగా- వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం బుధవారం న్యూఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ తో సమావేశం అయ్యారు. వాల్తేర్ డివిజన్ ను యధాతథంగా కొనసాగించాలని కోరారు. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు విజ్ఝప్తి చేశారు. ఈ బృందానికి రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి నేతృత్వం వహించారు. లోక్ సభ సభ్యులు గుడ్డేటి మాధవి (అరకు), ఆదాల ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట) రైల్వేమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వాల్తేర్ డివిజన్ కు ఉన్న ప్రాధాన్యతను వారు పియూష్ గోయెల్ కు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు.
అమరావతి వద్దు..దొనకొండా వద్దు.. మా తిరుపతిని రాజధానిగా ప్రకటించండి: కేంద్ర మాజీమంత్రి కొత్త డిమాండ్
రాయగడ డివిజన్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయినప్పటికీ- దీనికి సమాంతరంగా వాల్తేర్ డివిజన్ ను కూడా కొనసాగించాలని అన్నారు. వాల్తేరు డివిజన్ లేకుండా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటు చేసి, ఉపయోగం ఉండదంటూ ఉత్తరాంధ్ర ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వాల్తేర్ డివిజన్ ను రద్దు చేసే సమయానికి దాని వార్షిక ఆదాయం 7,053 కోట్ల రూపాయలుగా నమోదైందని అన్నారు. అలాంటి డివిజన్ ను రద్దు చేయడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. రాజకీయ కారణాలను పక్కన పెట్టి.. వాల్తేర్ డివిజన్ ను పునరుద్ధరించాలని వారు రైల్వేమంత్రికి విన్నవించారు. ఈ మేరకు ఓ వినపత్రాన్ని అందజేశారు.
దీనిపై పియూష్ గోయెల్ మాట్లాడుతూ- ఏపీ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని అన్నారు. వాల్తేర్ డివిజన్ ను పునరుద్ధరించడానికి గల అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. దీనితో పాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కింద రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని పియూష్ గోయెల్ చెప్పారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వానికి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే పేరుందని కితాబిచ్చారు. సాధ్యమైనంత త్వరగా రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయడంతో పాటు వాల్తేర్ డివిజన్ పునరుద్ధరణపై చర్యలు తీసుకుంటామని అన్నారు.