టీడీపీ ఎమ్మెల్యే, నేతలపై వేసీపీ మద్దతుదారుల దాడి: పలువురికి గాయాలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల దాడులే కాదు భౌతిక దాడులు కూడా చోటు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా, అభివృద్ది పనుల శంకుస్థాపన కోసం వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేపై పలువురు వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.
విశాఖలోని అరిలోవ 13వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ మద్దతుదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో దాడులకు నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు అక్కడే బైఠాయించారు. ఈ ప్రాంతానికి సంబంధం లేనివారువచ్చి దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. వైసీపీ రౌడీలు, గుండాలు దాడులు చేశారని వెలగపూడి ఆరోపించారు.
Recommended Video
వైసీపీ రౌడీల దాడిలో వార్డు సభ్యుడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులు ఉన్నప్పటికీ వైసీపీ రౌడీలు యధేచ్ఛగా దాడులు చేశారని అన్నారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంలో పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు.