విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ పాదయాత్ర: రూట్ మ్యాప్ ఇదే
విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్సార్సీపీ ఈ ప్రదర్శనను తలపెట్టింది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం పట్ల తాము నిరసనను వ్యక్తం చే్స్తోన్నామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ పాదయాత్రను చేపట్టనున్నట్లు ఇదివరకే అధికార పార్టీ నేతలు వెల్లడించారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ను విడుదల చేశారు.
వైసీపీ ఎంపీ, పీసీసీ చీఫ్ మధ్య వాగ్వివాదం: హీరో అవుదామంటే కుదరదంటూ ఫైర్
శనివారం ఉదయం 8:30 గంటలకు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పాదయాత్ర ఆరంభం కానుంది. అక్కడి నుంచి అసీల్మెట్ట, సంగం జంక్షన్, కాళీ ఆలయం, తాటిచెట్ల పాలెం, కంచరపాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, నావల్ అర్మామెంట్ డిపో (ఎన్ఏడీ) జంక్షన్, విమానాశ్రయం, షీలా నగర్, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ (బీహెచ్వీపీ), పాత గాజువాక, శ్రీనగర్ మీదుగా విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ఆర్చి వరకు సాగుతుంది. ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగుస్తుంది.
రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, లోక్సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం), డాక్టర్ బీవీ సత్యవతి (అనకాపల్లి), జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి (గాజువాక), గుడివాడ అమర్నాథ్ (అనకాపల్లి), అన్నంరెడ్డి ఆదీప్ రాజ్ (పెందుర్తి), ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (యలమంచిలి) ఇందులో పాల్గొననున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు, నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామని, అవసరమైతే ఢిల్లీకి కార్మిక సంఘాల ప్రతినిధులను తీసుకెళ్తామని విజయసాయి రెడ్డి ఇదివరకే వెల్లడించారు. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు. రాజకీయాల జోలికి వెళ్లకుండా సమైక్యంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సి ఉందని అన్నారు.