వైసీపీ, టీడీపీ సవాళ్లు: విశాఖ తూర్పు నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీసుల మోహరింపు
విశాఖపట్నం: నగరంలోని తూర్పు నియోజకవర్గం గత రెండు మూడు రోజులుగా రాజకీయంగా బాగా వేడెక్కింది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎమ్మెల్యే వెలగపూడికి సాయిబాబా ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. ఆ తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలతో సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు అమర్నాథ్.
ఆలయం వద్ద గంటపాటు వేచిచూసిన అమర్నాథ్.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ రాకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం వైసీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. ఆ తర్వాత కొంతసేపటికి వెలగపూడికి అనుకూలంగా నిరసన ర్యాలీ చేపట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
శాంతభ్రదతలకు విఘాతం కలగకుండా ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను టీడీపీ ఖండించింది. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన స్థానిక ఎమ్మెల్యేలు ప్రమాణాలంటూ సవాళ్లు విసురుకున్నారు. విశాఖ తూర్పులోని సాయిబాబా ఆలయంలో ఇందుకు వేదికగా ఎంచుకోవడంతో పోలీసులు ముందుగా అప్రమత్తమై భారీగా బందోబస్తు చేపట్టారు.
తమ పార్టీ పెద్దలపై ఆరోపణలు చేసినందుకే తాము స్పందించామని వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ తెలిపారు. స్థానికేతరుడైన ఎమ్మెల్యే వెలగపూడి.. విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. విశాఖ భూ ఆక్రమణలపై త్వరలో సిట్ నినివేదిక వస్తుదని తెలిపారు. ఆక్రమణలకు పాల్పడినవారిపై చర్యలు తప్పవని అన్నారు.
కాగా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాట్లాడుతూ.. తాను సవాలు విసిరింది ఎంపీ విజయసాయి రెడ్డికి అని, ఎమ్మెల్యేకు కాదని అన్నారు. ఆయన తన సవాలు స్వీకరించకుండా ఇతరులతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. విజయసాయి రెడ్డి వస్తే సింహాచలం అప్పన్న సాక్షిగా ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు.