టీడీపీకి గంటా ఇచ్చే షాక్ మామూలుగా లేదుగా - మరికొందరు మాజీ ఎమ్మెల్యేలతో వైసీపీలో
విశాఖపట్నం: రాష్ట్ర రాజకీయాలన్నీ ఇప్పుడు ఉత్తరాంధ్ర చుట్టే తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పార్టీని వీడబోతోండటం కలకల రేపుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తోన్న ఈ విశాఖ నార్త్ ఎమ్మెల్యే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నారనే వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రత్యేకించి తెలుగుదేశంలో.
పార్టీకి దూరంగా..
2019 నాటి ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీకి చెందిన కన్నపరాజుపై సుమారు 2,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రం మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం వీచినప్పటికీ- దాన్ని తట్టుకున్న 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆయనా ఒకరు. గెలిచిన తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ పరంగా ఎలాంటి సమీక్షా సమావేశాలకు గానీ, కార్యక్రమాలకు గానీ హాజరు కాలేదు.
చేరిక లాంఛనమే..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో తన పదవికి రాజీనామా చేశారాయన. దాన్ని స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. టీడీపీకి గంటా శ్రీనివాస్ గుడ్బై చెప్పడం ఖాయమేనంటూ మొదటి నుంచీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ- అవి ఇప్పుడు వాస్తవ రూపం దాల్చాయి. డిసెంబర్ 1వ తేదీన గంటా శ్రీనివాస్.. వైఎస్ఆర్సీపీలో చేరబోతోన్నారనే వార్తలు వెల్లువెత్తాయి. దీన్ని ఆయన తోసిపుచ్చట్లేదు. దీనితో పార్టీ మారడం ఖాయమైంది.
ఉత్తరాంధ్రపై..
గంటా శ్రీనివాస్.. పార్టీని వీడబోతోండటం ప్రధానంగా టీడీపీలో కలకలం రేపుతోంది. ఉత్తరాంధ్రపై గట్టిపట్టు ఉందాయనకు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం అదనపు బలం. ఏ పార్టీ నుంచి అయినా, ఏ స్థానం నుంచి పోటీకి దిగినా అపజయాన్ని చవి చూడలేదు. అలాంటి నాయకుడు టీడీపీని వీడబోతోండటం ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి ఉత్తరాంధ్రా జిల్లాల్లో.
మాజీ ఎమ్మెల్యేలతో..
తనకు ఉన్న పట్టు, బలాన్ని మరోసారి గంటా శ్రీనివాస్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోన్నారు. తన వెంట టీడీపీకి చెందిన మరో ఇద్దరు మాజీ శాసన సభ్యులను వైసీపీలోకి వెంటబెట్టుకెళ్లనున్నట్లు సమాచారం. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, అప్పల్నాయుడుతో కలిసి గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరొచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా మరికొందరు నాయకులు కూడా అధికారికంగా వైసీపీ కండువా కప్పుకొంటారని చెబుతున్నారు.
టీడీపీ నుంచే..
ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు మీసాల గీత. 2009లో ఎన్నికల్లో పీఆర్పీ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ కండువా కప్పుకొన్నారు. 2014 ఎన్నికల్లో విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2019లో ఆమెకు టికెట్ దక్కలేదు. గజపతి నగరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల్నాయుడు. 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య చేతిలో ఓడిపోయారు.