విశాఖ ఏజెన్సీలో గుప్పుమంటున్న గంజాయి.. వ్యాన్లో తరలిస్తున్న 421 కేజీల గంజాయి పట్టివేత
విశాఖ ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటోంది . మాదక ద్రవ్యాల మహామారి అయిన గంజాయిని విశాఖ ఏజెన్సీ నుండి ఇతర రాష్ట్రాలకు యధేచ్చగా రవాణా చెయ్యటం బాగా పెరిగిపోయింది. విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు సాగుతున్నా, అక్రమ రవాణా జరుగుతున్నా ఈ దందా అరికట్టటం పోలీసులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. అంబులెన్స్ , బొగ్గు లారీ , ఇటుకల లారీ ఇలా గంజాయి స్మగ్లర్లు రూటు మార్చి అర్ధం కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి తరలిస్తున్నారు.
విద్యార్థులే టార్గెట్ గా గుప్పుమంటున్న గంజాయి ... ట్రాఫికర్స్ వారే, విక్రయించేది వారే ..
ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలు మరువక ముందే విశాఖ జిల్లాలో మరోమారు భారీ గంజాయి పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున మాడుగుల మండలం ఘాట్ రోడ్ జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.9 లక్షల విలువైన 421 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు స్కూటీలను పోలీసులు సీజ్ చేశారు.గంజాయి బ్యాగులను ఎక్సైజ్ స్టేషన్ కి తరలించి, గంజాయి అక్రమ రావాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ , నార్కోటిక్స్, రెవెన్యూ అధికారులు గంజాయి సాగును, అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయటంలో దారుణంగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి . కానీ నిత్య కృత్యంగా మారిన గంజాయి అక్రమ రవాణాకు అడ్డు కట్ట వెయ్యటానికి నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీల్లో గంజాయి పట్టుబడటం నిత్యకృత్యంగా మారిపోయింది.