స్వరూపానంద అబద్దం చెప్పారా..? వివాదంలో జగన్ , కేసీఆర్ గురువు!
విశాఖపట్నం: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతిగా ఇన్నాళ్లూ గుర్తింపు ఉన్న స్వరూపానందేంద్ర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత ఇష్టుడు. ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దైవ సమానులు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన తరువాత కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక విమానంలో వచ్చి మరీ స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్త బలాన్ని నిర్ణయించినది స్వరూపానందేంద్రుల వారే. అంతేనా! మొన్నటికి మొన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికీ ఆయనే ముహూర్తాన్ని ఖాయం చేశారు.
అమ్మ ఒడిపై ప్రైవేటు విద్యాసంస్థల కన్ను: నిధుల స్వాహా కోసం అప్పుడే ధందా
ఫిల్మ్నగర్ దైవసన్నిధానం..
ఆ ఇద్దరు ముఖ్యమంత్రులను చూసిన తరువాత రెండు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఆయనను సందర్శించడానికి వెళ్తుంటారు. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ దైవ సన్నిధానంలో లేదా విశాఖపట్నంలోని చినముషిరివాడలోని శారదా పీఠంలో నివసిస్తుంటారు. ఫిల్మ్నగర్ సహా పరిసర ప్రాంతాల్లో నివసిస్తోన్న సినీ ప్రముఖులు పలువురు స్వరూపానందేంద్రను దర్శించడానికి వస్తుంటారు. చాలామంది నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులూ క్రమం తప్పకుండా ఆయనను కలుస్తుంటారు. ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇదే విషయాన్ని వెల్లడించారు.
భక్త సెలెబ్రిటీల జాబితాలో సునీత ఉన్నారంటూ..
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి సైతం అబద్ధం చెప్పారా? పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం- టాలీవుడ్ గాయని సునీత పేరు. మెగాస్టార్ చిరంజీవి, దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ గాయని సునీత వంటి సెలబ్రెటీలు చాలామంది తన భక్తుల జాబితాలో ఉన్నారని, వారందరూ తరచూ తన ఆశ్రమానికి వస్తుంటారనీ చెప్పుకొచ్చారు స్వరూపానందేంద్ర సరస్వతి. అది కూడా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నేనెప్పుడు కలిశాననీ..
ఈ ఇంటర్వ్యూ కాస్తా సునీత కంట్లో పడింది. తన పేరును ఆయన వాడుకోవడం ఆమెకు ఏ మాత్రం నచ్చినట్లు లేదు. అందుకే వెంటనే ఆ వార్తకు కౌంటర్ ఇచ్చారు. తన ఫేస్బుక్లో ఓ వివరణను పోస్ట్ చేశారు. తాను ఏనాడూ స్వరూపానందేంద్రను కలవ లేదని తేల్చేశారు. ఇప్పటివరకు తాను ఎప్పుడూ స్వరూపానందేంద్రను కలవలేదని సునీత ఫేస్బుక్ ద్వారా స్పష్టం చేశారు. స్వరూపందను కలిసిన ప్రముఖుల జాబితాలో తన పేరు ఉండడం సునీతకు దిగ్భ్రాంతికి గురి చేసినట్టయింది. దీంతో వెంటనే ఫేస్బుక్ ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చారు.
కొన్నింటికి తప్పక స్పందించాలి..అంటూ
స్వరూపానందేంద్ర సరస్వతి ఇంటర్వ్యూను చూసిన తరువాత సునీత స్పందించారు. తన ఫేస్బుక్ ద్వారా అభిప్రాయాలను తెలియజేశారు. వాటిని షేర్ చేశారు. `రోజూ చాలా వదంతులు వస్తుంటాయి. కానీ, కొన్నింటి గురించి తప్పక స్పందించాలి. స్వరూపానంద సరస్వతి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు చెప్పారు. నేనెప్పుడూ ఆయనను కలవలేదు. ఓ ఛానెల్లో మాట్లాడుతూ ఇతరుల పేరును ఎలా ఉపయోగిస్తారు.. అని సునీత ప్రశ్నించారు.
అడ్డంకులను ఎదుర్కొంటున్నా!
"ప్రతిరోజు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ జీవితంలో ఎదగడానికి ప్రయత్నిస్తుంటాం. ఈ క్రమంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు. నేనెప్పుడూ అలాంటివి పట్టించుకోకుండా ముందుకెళ్లాలనుకుంటా. కానీ కొన్నిసార్లు మాత్రం స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అందుకే స్పందించాను.. అని రాసుకొచ్చారు.