దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసే దొంగయ్యాడు .. దొంగను పట్టుకున్న పోలీసులు షాక్ అయ్యారు
ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే దొంగైతే ఇంకేముంది. జనాన్ని అలా నమ్మించి ఇలా దోచేయవచ్చు అనుకున్నాడు. పగలంతా జనానికి భద్రత కల్పించే పనిలో బిజిబిజిగా ఉండే ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఉదయం అంతా పోలీస్ రాత్రయితే చాలు దోచుకునే పనిలో అంతే బిజిగా ఉంటున్నాడు. ఇక ఇలా దోపిడీలు చేస్తూ జల్సాగా బతికేయ్యొచ్చు అనుకుంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు రైల్వే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు సదరు ప్రబుద్ధుడు .
దొంగాగా మారిన పోలీస్ .. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ పట్టుబడిన ఏఆర్ కానిస్టేబుల్
విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన మనకు సూర్య కుమార్ 2013లో పోలీస్ శాఖలో చేరాడు. మొదట్లో బాగానే ఉన్నా, గత మూడేళ్లుగా దొంగతనానికి అలవాటుపడిన సూర్య కుమార్ చైన్ స్నాచర్ గా మారాడు. ఒంటరి మహిళల టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న డు. అంతేకాదు రైళ్లలో బ్యాగుల చోరీకి కూడా పాల్పడుతూ రైల్వే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే కంచె చేను మేసిన చందంగా దొంగతనాలు చేస్తూ దొరికిపోవడం అటు పోలీస్ శాఖను సైతం విస్మయానికి గురిచేసింది.
విజయనగరం జిల్లాలో చోరప్రవీణుడిగా మారిన ఏఆర్ కానిస్టేబుల్ సూర్య కుమార్.. పట్టుకున్న రైల్వే పోలీసులు
విజయనగరం పట్టణ పరిధిలో రాత్రి వేళల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న సూర్య కుమార్ పార్వతీపురం వెళ్లడం రైల్వే స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు చేశాడు. విజయనగరం రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక దొంగతనం చేశాడు. ఇక ఒంటరి మహిళల నే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్న పోలీసులకు పట్టుబడిన సూర్యకుమార్ 2016లో ఒకమారు జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు.
ఇక 2017 లో తిరిగి విధుల్లో చేరిన సూర్య కుమార్ 2018 డిసెంబర్ నుండి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నాడు. రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో అక్కడ చోరీకి పాల్పడిన సూర్యకుమార్ తప్పించుకు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అతడిని వెంబడించి పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుండి 70 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో 20 గ్రాములు ఓ ప్రైవేటు బ్యాంకుల్లో తనఖా పెట్టాడని వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక చోరీలకు పాల్పడుతున్న సూర్య కుమార్ పై కేసు నమోదు చేసి రైల్వే కోర్టుకు తరలించగా కోర్టు సూర్య కుమార్ కు రిమాండ్ విధించింది.
పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్న దొంగ పోలీసులు .. పోలీసులపైనా నిఘా అవసరంb
పోలీస్ శాఖలో పని చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న సూర్యకుమార్ లాంటి వారి వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తోంది. పోలీసులలో దొంగలు కూడా ఉన్నారు అన్న భావన ప్రజలకు పోలీసులపై ఉన్న విశ్వాసం సన్నగిల్లేలా చేస్తుంది. ఇక ఇలాంటి వారు పోలీస్ శాఖలో ఎందరున్నారు అన్నది పరిశీలించి, వారందరికీ చెక్ పెట్టకుంటే పోలీస్ శాఖ పరువు గంగలో కలిసే ప్రమాదముంది. మరి ఇప్పటికైనా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒక కంట కనిపెట్టాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఉన్నతాధికారులపైన ఉంది.