అచ్చెన్నాయుడుకి నోటీసులు- సంతబొమ్మాళి విగ్రహం తరలింపు కేసులో
ఏపీలో విగ్రహాల రాజకీయం సద్దుమణుగుతుందని భావిస్తున్న తరుణంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పోలీసులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. సంతబొమ్మాళిలో విగ్రహం తరలింపు కేసులో ఆయన పాత్రపై ప్రశ్నించేందుకు పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలి పరిధిలోకి వచ్చే సంతబొమ్మాలి మండలంలో ఉన్న పాలేశ్వరస్వామి ఆలయంలో శిధిలమైన నంది విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని ఈ మధ్యే ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 14న పాత విగ్రహాన్ని కొందరు గుట్టుచప్పుడు కాకుండా పాలేశ్వరస్వామి జంక్షన్ వద్దనున్న సిమెంట్ దిమ్మెపై పెట్టారు. ఈ దిమ్మెపై మాజీ సీఎం వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అదే స్ధానంలో పాత పాలేశ్వరస్వామి విగ్రహం పెట్టడంతో స్ధానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న వారు ముందురోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్దానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని కలిసినట్లు పోలీసులు నిర్ధారించారు.
దీంతో సంతబొమ్మాళిలో మతఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారు అచ్చెన్నాయుడిని కలవడంపై దృష్టిపెట్టారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు పాత్రను తేల్చేందుకు ఆయన్ను కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టేషన్కు రావాలని సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు. అచ్చెన్నాయుడిని ప్రశ్నించిన తర్వాత ఆయన పాత్ర ఉన్నట్లు తేలితే ఆయనపైనా కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.