విజయనగరంలో రాజుగారి శకం ముగిసిందా ? రాజకీయాలకు గుడ్ బై !
విజయనగరం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా వివిధ హోదాల్లో చక్రం తిప్పిన అశోక్ గజపతిరాజు శకం ముగిసినట్లే కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తనకు అవమానకర రీతిలో ఉద్వాసన పలికి అన్న కూతురు సంచయిత గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా నియమించడంతో ఇప్పుడిక రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మంచిదని అశోక్ భావిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
సంచయిత రాకతో మారిన సమీకరణాలు
నిన్న మొన్నటి వరకూ విజయనగరం రాజకీయాల్లో చక్రం తిప్పిన పూసపూటి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా ఓ వెలుగు వెలిగారు. దశాబ్దాలుగా పూసపాటి వంశీయుల చేతిలో ఉన్న మాన్సాస్ ట్రస్టు బాధ్యతలను అశోక్ తదనంతరం మాత్రమే మరొకరు చేపడతారని అంతా భావించారు. కానీ అశోక్ అనుకున్నదొకటి జరిగింది మరొకటి.. తన స్ధానంలో కూతురు ఆదితి గజపతిరాజుకు మాన్సాస్ ట్రస్టుతో పాటు ఇతర బాధ్యతలూ అప్పగించాలని రాజుగారు భావించారు. కానీ ఇప్పుడు సంచయిత ఎంట్రీతో మొత్తం సీన్ రివర్స్ అయింది.
2004 ఎన్నికల్లో ఓటమితోనే మొదలు..
1978లో విజయనగరం అసెంబ్లీ స్ధానంలో జనతా పార్టీ అభ్యర్ధిగా గెలుపుతో చట్టసభల్లో అడుగుపెట్టిన అశోక్ గజపతిరాజుకు 2004 ఎన్నికల వరకూ ఎదురేలేదు. తొలుత జనతా పార్టీలోనూ, ఆ తర్వాత టీడీపీ నుంచి అశోక్ వరుస విజయాలు సాధించారు. విజయనగరంలో ఏనాడూ తనకు ఓటు వేయాలని కూడా ఓటర్లను అభ్యర్ధించని చరిత్ర అశోక్ ది. అలాంటిది 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, వైఎస్సార్ ఛరిష్మా, అశోక్ పేరుతో అనుచరులు చేసిన అక్రమాలు వంటి కారణాలతో అప్పట్లో అశోక్ ఓడిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా తొలిసారి ఓటర్లకు చేతులెత్తి దండం పెట్టిన అశోక్.. తన పరువు కాపాడాలని అభ్యర్ధించారు. ఓటర్లు కరుణించడంతో ఆ ఎన్నికల్లో అశోక్ మరోసారి గెలిచారు
2014 ఎన్నికల్లో ఎంపీగా గెలుపు- 2019లో ఓటమి
మారిన పరిస్ధితుల్లో 2014లో టీడీపీ నుంచి విజయనగరం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అశోక్ ఘనవిజయం సాధించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ తరఫున కేంద్ర కేబినెట్ లో పౌరవిమానయాన మంత్రిగా అవకాశం వచ్చింది. తిరిగి 2019 ఎన్నికల్లో విజయనగరం స్ధానం నుంచి పోటీ చేసిన అశోక్.. వైసీపీ హవాలో ఓటమిపాలయ్యారు. అదే సమయంలో ఆయన వారసురాలిగా తెరపైకి వచ్చిన కూతురు ఆదితి విజయలక్ష్మీ గజపతిరాజు కూడా విజయనగరం అసెంబ్లీ స్ధానం నుంచి ఓడిపోయారు. అప్పటి నుంచి తండ్రీ కూతుళ్లు అవమానభారంతో కుంగిపోతున్నారు. అదే సమయంలో వైసీపీ సర్కారు మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం పాలకమండలి ఛైర్మన్ల బాధ్యతల నుంచి తప్పించడం అశోక్ కు శరాఘాతంగా మారింది.
Recommended Video
విజయనగరంలో రాజుగారి శకం ముగిసిందా?
విజయనగరం జిల్లా రాజకీయాల్లో అప్రతిహతంగా చక్రం తిప్పిన అశోక్ గజపతిరాజును 2004 తర్వాత 2019లో మరోసారి ఓటమి పలకరించింది. ఇది ఓ రకంగా దెబ్బ అనుకుంటే కూతురు ఆదితి ఓటమితో మరో దెబ్బ తగిలినట్లయింది. తాజాగా మాన్సాస్ పదవి నుంచి కూడా ప్రభుత్వం తప్పించడంతో ఇక జిల్లాలో రాజుగారి శకం ముగిసిందన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో రాజవంశీకుడిగా, మర్యాదస్తుడిగా పేరు తెచ్చుకున్న అశోక్... సాధారణ రాజకీయ నేతల్లా ఐదేళ్లకోసారి ఓట్ల కోసం నానాగడ్డీ కరిచేందుకు సిద్ధంగా ఉండరని జిల్లా వాసులకూ తెలుసు. కాబట్టి ఈసారి ఆయన హుందాగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారని భావిస్తున్నారు.