రామతీర్థం దాడి: కావాలనే చేశారు, నిందితులు ఎవరో తేలుతుంది: సీఐడీ చీఫ్
రామతీర్థం ఘటన ఆంధ్రప్రదేశ్లో అగ్గిరాజేసింది. రాముని విగ్రహాం ధ్వంసం ఘటనతో వివాదం కొనసాగుతోంది. ఘటనపై ఏపీ సర్కారు సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మంగళవారం విజయనగరం జిల్లాలో గల రామతీర్థం విగ్రహం ధ్వంసం అయిన ప్రాంతాన్ని తన బృందంతో కలిసి పరిశీలించారు.
రాముడి విగ్రహంపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఘటన స్థలంలో హేక్సా బ్లేడ్ లభ్యమైందని వెల్లడించారు. దీంతో కొందరు కావాలనే దాడి చేశారని వివరించారు. ఇదీ ఆకతాయిలు పని కాదని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నించరాని తెలిపారు. సమాజంలో భిన్న వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఘటనకు పాల్పడి ఉంటారని సునీల్ కుమార్ తెలిపారు.
అక్కడ ఉన్న నగలు, ఇతర విలువైన వస్తువులు భద్రంగానే ఉన్నాయని వివరించారు. జరిగిన ఘటనను చూస్తుంటే చిల్లరగా తిరిగే వారి పనిలా అనిపించడం లేదని చెప్పారు. ప్రణాళికతోనే దాడి జరిగినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. తమ దర్యాప్తులో ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది స్పష్టంగా తేలుతుందని వివరించారు. రామతీర్థం ఘటనకు సంబంధించి ఇంతకుమించి ఇప్పుడే చెప్పలేమని అన్నారు.