చెత్త వాహనంలో కరోనా బాధితుల తరలింపు- విజయనగరంలో దారుణం-సర్కార్ సీరియస్...
విజయనగరం జిల్లాలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా బాధితులను తీసుకెళ్లేందుకు సకాలంలో అంబులెన్స్ లేకపోవడంతో చెత్త తరలించే వాహనంలోనే వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీనిపై విపక్షాలతో పాటు సర్వత్రా విమర్శలు రావడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాథమిక విచారణలో అధికారుల ప్రమేయం లేకుండానే కింది స్ధాయి సిబ్బంది బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు తేలింది. దీనిపై ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు జరుగుతోందని అధికారులు ప్రకటించారు.
Recommended Video
మరో అమానవీయ ఘటన..
కరోనా వ్యాప్తి మొదలయ్యాక మనుషులను మనుషుల్లా చూడకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కుటుంబ సభ్యులైనప్పటికీ కరోనా బాధితులను దూరంగా ఉంచుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కరోనా మృతుల అంత్యక్రియలను సైతం జేసీబీలతో పూర్తి చేస్తున్న ఘటనలు వింటూనే ఉన్నాం. కానీ తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మరో తరహా దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు కరోనా బాధితులను చెత్త తరలించే వాహనంలో ఎక్కించి స్ధానిక మహరాజా ఆసుపత్రికి పంపిన వైనం తీవ్ర కలకలం రేపింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం విచారణ జరుపుతోంది.
జరిగిందిదీ...
నెల్లిమర్ల మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే జరజాపుపేట బీసీ కాలనీలో కరోనా సోకిన ఓ మహిళ, ఇద్దరు పురుషులను స్వచ్ఛ భారత్-స్వచ్ఛ నెల్లిమర్ల పేరు రాసి ఉన్న ఓ మినీ ట్రక్కులో మహారాజా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. మరోవైపు ఇంకో వ్యక్తి అక్కడే ఉండి డ్రైవర్ సీటులో ఓ పీపీఈ కిట్ ఉంచడంతో పాటు రోగులను జాగ్రత్తగా ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని కోరుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. దీంతో రోగులను తీసుకెళ్లే తీరు ఇదేనా అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కరోనా సోకిందన్న పేరుతో రోగులను ఇలా చెత్త వాహనాల్లో తరలిస్తే వైరస్ సంగతి దేవుడెరుగు.. కొత్త రోగాలు వస్తాయని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ లపేర్కొన్నారు.
ప్రభుత్వం సీరియస్.. వివరణ..
నెల్లిమర్లలో అమానవీయ రీతిలో ముగ్గురు కరోనా బాధితులను చెత్త ట్రాక్టర్ లో ఆస్పత్రికి తరలించడంపై మున్సిపల్ కమిషనర్ అప్పల నాయుడు స్పందించారు. గతంలో ఎన్నడూ కరోనా బాధితులను తరలించేందుకు మున్సిపాలిటీ చెత్త వాహనాలు వాడలేదని, ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వాహనాన్ని తమకు తెలియకుండా కొందరు ఓ డ్రైవర్ సాయంతో తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని పెద్దలు కొందరు ముగ్గురికి కరోనా సోకిందని తెలిసి అర్జంటుగా ఆస్పత్రికి తరలించాలనే కంగారులో ఏ వాహనం కనిపించకపోవడంతో చెత్త వాహనం వెళుతుంటే ఆపి ఇలా వీరిని పంపినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.