చివరి విడత పోలింగ్: స్వయంగా బరిలో దిగిన పోలీస్ బాస్: ఓటర్లను పలకరిస్తూ
విజయనగరం: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అక్కడితో - ఇక పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఘట్టానికి తెర పడుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపును స్థానిక రిటర్నింగ్ అధికారులు చేపడతారు. గెలుపొందిన సర్పంచ్ల పేర్లను వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ను కూడా ప్రకటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ ప్రజా ప్రతినిధుల పాలనకు శ్రీకారం చుట్టినట్టవుతుంది.
తుది విడత పోలింగ్ కావడం వల్ల రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాల గురించి ఆరా తీశారు. పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఇబ్బంది పడిన వయోధిక వృద్ధులు, వికలాంగులకు సహకారం అందించిన పోలీసులను ఆయన అభినందించారు. వారికి ప్రోత్సాహకాలను అందజేశారు.
All smiles to meet the Police Boss: #DGP Gautam Sawang interacted with the voters of Kothavalasa Mandal, #Vizianagaram who were extremely happy upon seeing him in person. He inquired about the #voting experience and appreciated the #humane gestures by the Police officials. pic.twitter.com/0LizNHjxCD
— Andhra Pradesh Police (@APPOLICE100) February 21, 2021
ఈ ఉదయం గౌతమ్ సవాంగ్.. విజయనగరం జిల్లా కొత్తవలస పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి పోలింగ్ కేంద్రంలో బారులు తీరి నిల్చున్న ఓటర్లను పలకరించారు. వారితో చిరునవ్వుతో మాట్లాడారు. ఏవైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. మంచినీటి వసతి, శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయని ఓటర్లు ఆయనకు తెలిపారు. నడవలేని వారికోసం పోలీసులు ప్రత్యేకంగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు.
అనంతరం ఆయన స్థానిక పోలీసులతో మాట్లాడారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాల గురించి ఆరా తీశారు. విధి నిర్వహణలో భాగంగా వికలాంగులు, వయోధిక వృద్ధులను పోలింగ్ కేంద్రాలకు తీసుకుని రావడానికి సహకరించిన పోలీసులను ఆయన అభినందించారు. వారికి ప్రోత్సాహకాలను అందజేశారు. ఎన్నికలు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పండుగలాంటిదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని గౌతమ్ సవాంగ్ చెప్పారు.