చంద్రబాబుకు మరో షాక్... టీడీపీని వీడిన మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగిలింది. విజయనగరంలో జిల్లాలో టీడీపీ కీలక నేత,మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సరైన గుర్తింపు దక్కనందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 2004 నుంచి ఇప్పటివరకూ కనీసం బాబూరావు ఉన్నాడని కూడా పార్టీ గుర్తించలేదన్నారు. ఆత్మగౌరవ ప్రతీకగా ఏర్పాటైన టీడీపీలో ఇప్పుడు తనకు ఆత్మగౌరవం,ఆత్మ సంతృప్తి లేకుండా పోయాయని అన్నారు. అందుకే కుటుంబ సభ్యులతో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
పార్టీలో తనను పొమ్మన లేక పొగబెట్టినట్లుగా కనిపిస్తోందని... అలా అని తాను ఎవరిపై విమర్శలు చేయదలుచుకోలేదని అన్నారు. 1975లో శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశానని... 1978లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరానని చెప్పారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ వచ్చానన్నారు.అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యే స్థానాల బీ ఫారాలు తన చేతికే ఇచ్చేవారని చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ పార్టీలో చాలా తేడాలు వచ్చాయన్నారు.
ఇక పార్టీలో తనకు భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నాకే బయటకు వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించే సత్తా తనకు ఉందని... అయినా పార్టీలో మాత్రం సరైన గుర్తింపు లభించలేదని అన్నారు. ఆకలి అంటే ఏంటో తెలిసిన స్థితి నుంచి ఈ స్థాయి వరకూ ఎదిగొచ్చానని చెప్పారు. ఎటువంటి మద్దతు లేకపోయినా రెండుసార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశానన్నారు. చీపురుపల్లి ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అన్నారు. ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని... అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తానని తెలిపారు.
Recommended Video
గద్దె బాబూరావు గతంలో రెండుసార్లు టీడీపీకి రాజీనామా చేసి తిరిగి అదే పార్టీలో చేరారు. 2014లో చీపురు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసి ఓడిపోయారు.