కుప్పకూలిన కళాశాల భవనం: దసరా సెలవుల వల్ల తప్పిన పెను ప్రమాదం
విజయనగరం: విజయనగరం జిల్లాలో మంగళవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని కొత్తవలసలో ప్రభుత్వ కళాశాల తరగతి గదుల భవన సముదాయం కుప్పకూలిపోయింది. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో కళాశాలలో ఎవరూ లేరు. సాధారణ రోజుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటే దాని వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండే అవకాశాలు లేకపోలేదు. దసరా పండుగ సెలవుల సమయంలో భవనం కుప్పకూలిపోవడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం చోటు చేసుకోలేదు. సెలవుల వల్ల పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
నాలుగు రోజులుగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల ధాటికి పలు పాత కట్టడాలు, భవనాలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. అలాంటి కట్టడాల్లో నివాసం ఉంటోన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మున్సిపల్ అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేశారు. అదే సమయంలో కొత్తవలస కళాశాల భవనం కుప్పకూలిపోయింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు చదువుకునే కళాశాల అది. వందలాది మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. అలాంటి భవన తరగతులు కుప్పకూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది.
భవనంలో కొంత భాగం కూలిపోగా.. మిగతా భాగం కూడా నెలకొరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోడలు చాలా వరకు బీటలు వారి ఉన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే పలువురు కళాశాల వద్దకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దసరా సెలవులు కావడంతో.. విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. చాలాకాలంగా భవనం శిథిలావస్థకు చేరకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించి, వాటిని శాశ్వతంగా తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.