ప్రైవేటు ఆస్తి కాదు: మాన్సాస్ ట్రస్టుపై అశోక్ గజపతి రాజు, కోట్ల ఆస్తులున్నాయంటూ..
విజయగనరం: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రాజకీయంగా ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఓ వైపు మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత చైర్ పర్సన్ సంచయిత, మరోవైపు టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి అశోక్ గజపతి రాజు స్పందించారు.
ఇదేమీ.. ప్రైవేటు ఆస్తి కాదు..
రాజకీయాలకు అతీతంగా మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు ఉండాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. మాన్సాస్ ట్రస్ట్.. కుటుంబ, ప్రైవేటు ఆస్తి కాదని అన్నారు. తాను ఛైర్మన్గా ఉన్న సమయంలో ఎంతో మంది అనేక ఆలోచనలు చెప్పారని, అయితే, ఒక నిర్ణయం తీసుకునే ముందు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ పేరిట కోట్ల ఆస్తులు
గురువారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టుకు అనేక చోట్ల భూములున్నాయని, రూ. 125 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని అశోక్ గజపతి రాజు తెలిపారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో కీలక మార్పులు జరిగాయి.
సంచయిత నిర్ణయం నేపథ్యంలోనే అశోక్ గజపతి రాజు ఇలా?
కాగా, మాన్సాస్ ట్రస్ ఛైర్ పర్సన్ సంచయిత ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయనగరంలో ప్రసిద్ధి చెందిన ఎంఆర్ కాలేజీ(మహారాజ కళాశాల) ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు. ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడకు మార్చాలంటూ మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ ఏపీ సర్కారుకు లేఖ రాశారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా వెంటనే సమగ్ర నివేదిక పంపించాలంటూ కళాశాల విద్య స్పెషల్ కమిషనర్.. రాజమండ్రి రీజనల్ జాయింట్ డైరెక్టర్కు ఇటీవల లేఖ రాశారు. ఉన్నత విద్యామండలి వీటిని పరిశీలిస్తోంది. ఇక సర్కారు నుంచి కూడా సానుకూల నిర్ణయం వస్తే.. ఈ కాలేజీ ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అశోక్ గజపతిరాజు తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
అశోక్ గజపతి రాజు స్థానంలో సంచయిత..
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మాన్సాస్ ట్రస్టుకు ఛైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును జగన్ ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతి రాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ఛైర్ పర్సన్గా నియమించింది. కాగా, మాన్సాస్ ట్రస్ట్ కింద 108 ఆలయాలు, వివిధ విద్యాసంస్థలు, 14,800 ఎకరాల భూములు ఉన్నాయి.